వీళ్ళది భలే పొత్తు

రాబోయే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్, వామపక్షాలు పొత్తుల్లో పోటీ చేస్తాయని కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రకటించారు. మీడియా సమావేశంలో షర్మిల వామపక్షాల కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ ఎంతో ఆర్భాటంగా ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. నాలుగు రోజుల క్రితం వరకు సీపీఐ చంద్రబాబు నాయుడు తో పొత్తు పెట్టుకోవటానికి తహతహలాడిన విషయం అందరుచూసిందే. బీజేపీతో పొత్తువద్దని టీడీపీ, జనసేన, వామపక్షాలు పొత్తు పెట్టుకుందామని సీపీఐ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చంద్రబాబును పదేపదే బతిమలాడుకున్న విషయం అందరూ చూసిందే.

వీళ్ళ విజ్ఞప్తులను చంద్రబాబు పట్టించుకోకుండా బీజేపీతో పొత్తు దిశగా వెళుతున్నారు. ఈనెలాఖరులోగా పొత్తుల విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇక చంద్రబాబుతో లాభంలేదని అర్ధమైపోయి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. దీన్ని చాలా ఆర్భాటంగా ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ఈ మూడుపార్టీలు కాదు ఇలాంటి పార్టీలు ఎన్ని పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఉపయోగముండదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే జోగిజోగి రాసుకుంటే బూడిదరాలుతుందనే సామెత తెలిసిందే. ఈ సామెత కాంగ్రెస్, వామపక్షాలకు సరిగ్గా సరిపోతుంది.

పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లేమీలేదు. అలాగే వామపక్షాలకు అసలు ఓట్లేసిన వాళ్ళే లేరు. మూడు పార్టీలకు కలిపి కనీసం అరశాతం ఓట్లు కూడా లేవు. ఇలాంటి మూడుపార్టీలు పొత్తు పెట్టుకుని ఏమిసాధిస్తాయో ఎవరికీ అర్ధంకావటంలేదు. నిజానికి ఈ మూడుపార్టీలు జనాల నమ్మకాన్ని పోగొట్టుకుని చాలా కాలమే అయిపోయింది. రాష్ట్ర విభజనకు ముందే వామపక్షాలు జనాలకు దూరమైపోయాయి. అడ్డుగోలు విభజనతో కాంగ్రెస్ సీమాంధ్రను నాశనం చేసేసింది.

సో, ఈ కారణాలతోనే పై మూడుపార్టీలు జనాధరణను కోల్పోయాయి. తమపార్టీలు జనాధరణకు దూరమయ్యాయన్న విషయాన్ని పార్టీలే గుర్తించటంలేదు. ఈ పార్టీల తరపున పోటీచేస్తున్న అభ్యర్ధులు ప్రత్యర్ధులపై గెలవలేరు సరికదా కనీసం ఓడించటానికి కూడా పనికిరారు. ఇలాంటి పార్టీలు ఎన్నిపొత్తుపెట్టుకుంటే మాత్రం ప్రత్యర్ధులకు జరిగే నష్టమేమిటి ? 175 సీట్లలో పోటీచేయటానికి మూడుపార్టీలకు గట్టి అభ్యర్ధులు దొరికితే అదే చాలా గొప్పని చెప్పుకోవాలి. రాబోయే ఎన్నికల్లో మూడుపార్టీల పొత్తును జనాలు ఏ మేరకు ఆదరిస్తారు ? ఎన్ని ఓట్లొస్తాయో చూడాలి.