వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా

ఏపీలో మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మార్పుతో చాలామంది నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు పార్టీని వీడి టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. ఈ క్రమంలోని తాజాగా వైసీపీకి రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో సీఎం జగన్ కు పంపించారు.

వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని వేమిరెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అయతే, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఖలీల్ ను జగన్ నియమించడంతో ప్రభాకర్ రెడ్డి మనస్థాపానికి గురయ్యారని తెలుస్తోంది. కనీస సమాచారం లేకుండా కలిగిన ఆయనను నియమించడంతో వేమిరెడ్డి హర్ట్ అయ్యారట. దీంతో, పార్టీ కార్యక్రమాలకు అప్పటినుంచి ఆయన దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది.

అయితే, ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. వైసీపీ తరఫున నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ బరిలో నిలుస్తానని వేమిరెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత పరిణామాలు మారడంతో టికెట్ తనకు దక్కే అవకాశం లేదని వేమిరెడ్డి భావించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడబోతున్నారని తెలుస్తోంది. వేమిరెడ్డి టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరోవైపు, టీడీపీకి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొలుసు పార్థసారథిని చంద్రబాబు నియమించడంతో అసంతృప్తికి గురైన ముద్దరబోయిన పార్టీకి రాజీనామా చేశారు.