మేడిగడ్డ ఇక పనికిరాదా ? వేస్టేనా ?

మేడిగడ్డ బ్యారేజి ఇక నీటి నిల్వకు ఏమాత్రం పనికిరాదా ? బ్యారేజి నిర్మాణానికి పెట్టిన వేలాది కోట్ల ప్రజాధనమంతా వృధాయేనా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులను సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ బృందం పరిశీలన మొదలుపెట్టింది. మొదటగా మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించింది. పిల్లర్ల కింద సాయిల్ తో పాటు బ్యారేజీ నిర్మాణంలో నాణ్యతను కూడా గమనించింది. పిల్లర్లు ఎందుకు కుంగిపోయిందనే విషయమై స్టడీ చేసింది.

విశ్వసనీయవర్గాల ప్రకారం బ్యారేజిని అనుమతించిన ఎత్తుకు మించి కేసీయార్ ప్రభుత్వం నిర్మించిందట. అలాగే నీటి నిల్వ సామర్ధ్యానికి మించి నిల్వ చేసిందని తెలుసుకున్నట్లు సమాచారం. నిర్మించాల్సిన ఎత్తుకు మించి నిర్మించటం, కెపాసిటీకి మించి నీటిని నిల్వ చేయటంతో బ్యారేజీపైన విపరీతమైన బరువు పెరిగిపోయిందట. ఆ బరువును తట్టుకోలేకే ముందు నాలుగు పిల్లర్లు కుంగిపోయాయి. అలాగే బ్యారేజిలో కూడా చాలా చోట్ల పెద్ద పగుళ్ళున్న విషయాన్ని బృందం గమనించింది.

బ్యారేజీలో పగుళ్ళు కూడా అందరి కళ్ళకు డైరెక్టుగానే కనబడుతున్నాయి. కాబట్టి డ్యాంను ఉపయోగించటం సేఫ్టీకాదని నిపుణుల బృందం అభిప్రాయపడినట్లు తెలిసింది. ఎన్ని రిపేర్లు చేసినా బ్యారేజి నీటి నిల్వకు పనికిరాదని రిపేర్లు చేయటం తాత్కాలికమే తప్ప శాశ్వతంగా ఉపయోగపడదని బృందం తేల్చేసినట్లు సమాచారం. పైన బరువు పెరిగిపోయిన కారణంగానే పిల్లర్ల కింద ఉన్న ఇసుక బెడ్లు కదలిపోయాయట. ఎప్పుడైతే పిల్లర్లను పటిష్టంగా ఉంచాల్సిన ఇసుక బెడ్లు కదలిపోయాయో బరువును మోయలేక పిల్లర్లు కుంగిపోయాయి.

పిల్లర్లు కుంగిపోవటంతోనే పైన బ్యారేజి గోడలకు పగుళ్ళు వచ్చేశాయని నిపుణులు తేల్చారు. బుధవారం సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులను కూడా ఇదే బృందం పరిశీలించబోతోంది. ఈ మూడు ప్రాజెక్టులను నిపుణుల బృందం పరిశీలించి రిపోర్టు తయారుచేయబోతోంది. వెంటనే నేసనల్ డ్యాం సేఫ్టీ నిపుణుల బృందం కూడా పరిశీలించబోతోంది. ఏదేమైనా ఇప్పటి వరకు పరిశీలించిన రెండుమూడు బృందాలు కూడా మేడిగడ్డ బ్యారేజి పనికిరాదనే తేల్చాయి. మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాదంటే కాళేశ్వరం కూడా వేస్టనే అనుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారపడిందే మేడిగడ్డ బ్యారేజి మీద. మరి సుందిళ్ళ, అన్నారం భవిష్యత్తు ఏమిటో తేలాలి.