కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ.. తెలంగాణ‌లో ‘బెంజ్’ పాలిటిక్స్

తెలంగాణ రాజ‌కీయాల్లో అస‌లే ఉప్పు, నిప్పుగా ఉండే కాంగ్రెస్, బీజేపీల మ‌ధ్య మ‌రో కొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. అది కూడా.. ‘బెంజ్‌’ వ్య‌వ‌హారం కావ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.. బెంజ్ కారు కానుకగా అందుకున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రబాకర్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. అంతేకాదు.. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ఏ డేట్‌లో ఆమెకి కారు అందజేశారో, కారు తాళాలు ఎవరు ఇచ్చారో తన దగ్గర ప్రూఫ్స్‌ ఉన్నాయని అన్నారు.

అయితే, ప్రభాకర్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిప‌డ్డారు. ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. దీపాదాస్ మున్షీని బెంగాలీ కాళీమాతగా అభివ‌ర్ణించారు. అవినీతి, అక్రమాలు, అబద్ధాలు పెట్టుబడిగా బతికే పార్టీ బీజేపీ. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కి ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉన్నట్టు ఉంది. ఎంపీ టికెట్ కోసమే ఇలాంటి సెన్షేషనల్ కామెంట్స్ చేస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు.

ఇక‌, ప్రభాకర్‌ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఫైర్ అయ్యారు. “బహిరంగ క్షమాపణ చెప్పాలి.. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్ప”వని హెచ్చరించారు.”దీపాదాస్ మున్షీ బెంగాల్ టైగర్. తూటాలను ఎదుర్కొన్న నాయకురాలు. ఆమెపై అడ్డగోలుగా నోరు పారేసుకుంటే సహించం. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి దోహదపడిన నాయకురాలు దీపా దాస్ మున్షీ. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తుందనే సర్వేలతో బీజేపీ నేతలు భయపడిపోయి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు” అని మధుయాష్కీ గౌడ్ అన్నారు. ప్రభాకర్ ఆరోపణలు వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతోంద‌ని మ‌హేష్ అన్నారు. బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని అందుకే పసలేని, పనికిరాని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకుల మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మబోర‌న్నారు. ప్రభాకర్ క్షమాపణ చెప్పి తన ప్రకటనను వెనక్కు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ చేశారు.