చంద్ర‌బాబు ప్ర‌యోగం.. విక‌టిస్తే.. ఎవ‌రు బాధ్యులు?

ఎన్నిక‌లు వ‌చ్చేశాయి. ఇప్ప‌టికే పార్టీ అధినేత‌గా.. 45 ఏళ్ల సీనియార్టీ ఉన్న నాయ‌కుడిగా చంద్ర‌బాబు ఎక్క‌డ ఎవ‌రికి టికెట్ ఇస్తే.. గెలుస్తార‌న్న అంచ‌నా ఉండే ఉంటుంది. ఈ విష‌యంలో ఆయ‌న ఇప్ప‌టికే ఒక క్లారిటీకి వ‌చ్చి ఉండాలి. ఇక‌, ఎన్నిక‌లకు ముందు జాబితాను కూడా ప్ర‌క‌టించేస్తార‌ని అంద‌రూ భావిస్తు న్నారు. ఒక‌రిద్ద‌రు మిన‌హా.. మెజారిటీ నాయ‌కుల‌కు టికెట్లు ద‌క్కుతాయ‌ని అనుకున్నారు. కానీ, ఇక్క‌డే చంద్ర బాబు కొత్త ప్ర‌యోగం చేశారు. ఆ విష‌యం కాస్తా.. ఇప్పుడు బ‌య‌ట‌కు లీకైంది. ఇది పార్టీ నేత‌ల్లో ఆగ్ర‌హం తెచ్చేలా చేస్తోంది.

ఏం జ‌రిగింది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్వ‌యంగా.. ఇప్ప‌టికే నాలుగు రూపాల్లో పార్టీ అభ్య‌ర్థుల విష‌యంలో నివేదికలు తెప్పించుకున్నారు. ఐటీడీపీ, జ‌న్మ‌భూమి క‌మిటీలు, క్షేత్ర‌స్థాయి పార్ల‌మెంట‌రీ ఇంచార్జుల క‌మిటీలు, సీనియ‌ర్ మాజీ మంత్రుల క‌మిటీల నుంచి నివేదిక‌లు తెప్పించుకున్నారు. నేరుగా అభ్య‌ర్థుల‌ను చాలా మందిని ఉండ‌వ‌ల్లికి పిలిచి చ‌ర్చించారు కూడా.ఇవ‌న్నీ అయిపోయిన త‌ర్వాత‌.. ఎవ‌రైనా ఏమ‌నుకుంటారు. త‌మ‌కు టికెట్ ఖాయ‌మ‌ని అనుకుంటారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు మ‌రో స‌ర్వేచేస్తున్నారు.

అది కూడా చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా.. శుక్ర‌వారం, శ‌నివారం నుంచి వ‌రుస‌గా వారం రోజుల పాటు ఇదే ప‌నిపై ఉండ‌నున్నార‌ని పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ర్యాండ‌మ్‌గా ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వారిచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నట్టు తెలుస్తోంది. అయితే.. దీనినిత‌మ్ముళ్లు త‌ప్పుబ‌డుతున్నారు.

చంద్ర‌బాబు అడిగార‌ని.. ప్ర‌జ‌లు ఏదో చెప్పేస్తారు. అది న‌మ్మేస్తారా? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు.. ఇప్పుడు స‌ర్వేలో చెబుతున్న మాట‌లు రేపు ఎన్నిక‌ల వ‌ర‌కు ఉంటాయా? అని అంటున్నారు. మీకు న‌చ్చిన వాళ్ల‌కు టికెట్ ఇచ్చుకోండి అని కృష్ణాజిల్లా నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. కాగా, చంద్ర‌బాబు స‌ర్వేలో .. ఆయ‌న ప్ర‌జ‌ల‌తో నేరుగా మాట్లాడుతున్నారు. నేను చంద్ర‌బాబును.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఫ‌లానా నాయ‌కుడి ప‌రిస్థితి ఎలా ఉంది? ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. మీరు ఓటేస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. దీని ఆధారంగానే ఆయ‌న టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.