నీళ్లు-నిప్పులు.. తెలంగాణ అసెంబ్లీలో కాక‌!

తెలంగాణ అసెంబ్లీలో నీళ్లు నిప్పులుగా మారాయి. అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో యుద్ధం జ‌రుగుతోంది. రాష్ట్రంలోని నీటిపారుద‌ల రంగానికి సంబంధించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తాజాగా శ‌నివారం ఉద‌యం స‌భ‌లో వైట్‌పేప‌ర్‌ రిలీజ్ చేసింది. అనంత‌రం.. దీనిపై మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి హ‌క్కుగా ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేక పోయింద‌ని గ‌త స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతం ఎక్కువ‌గా ఉన్నా.. నీళ్ల విష‌యంలో స‌మ‌ర్థ‌వంత‌మైన వాటా తెచ్చుకోలేక పోయార‌ని అన్నారు.

ఇక‌, దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయ‌కుడు.. హ‌రీష్‌రావు కూడా అదే రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో సీఎం రేవంత్ స‌భ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో సీన్ మొత్తం మ‌రింత వేడెక్కింది. “నీటిపారుదల రంగంపై విపక్షాలు అభిప్రాయం చెప్పాయి. గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై వేసిన‌ కమిటీ నివేదికను సభ ముందు ఉంచుతున్నా. తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మరోచోట ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఇక్కడే పునాది పడింది. గత ప్రభుత్వం తప్పులు అంగీకరించి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది” అని రేవంత్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. బీఆర్ఎస్ ఘోర‌మైన త‌ప్పులు చేసింద‌ని అన్నారు. ఆ తప్పులను అంగీకరించి సలహాలు ఇస్తే కొంతమేరకైనా సమాజం అభినందించేదన్నారు. తప్పులు అంగీకరించకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిప‌డ్డారు. దీనికి ప్ర‌తిగా మాజీ మంత్రి హ‌రీష్‌రావు కూడా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. శ్వేతపత్రంలో సత్యదూరమైన అంశాలున్నాయన్నారు. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తా,. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. అయితే, 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్‌మానేరు ప్రాజెక్టుకు సంబంధించి రూ.106 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. మా ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు చేసి మూడేళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశాం. ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉంది” అని అన్నారు. మొత్తానికి ఈ చ‌ర్చ ఇంకా కొన‌సాగుతూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.