మాజీ ఎంఎల్ఏ సైకిలెక్కుతారా ?

ఇపుడిదే అంశం తెలుగుదేశంపార్టీతో పాటు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన తంబళ్ళపల్లి నియోజకవర్గంలో కొంతకాలంగా గట్టి నేతలేరు. ఎందుకంటే నియోకవర్గం ఇన్చార్జిగా మాజీ ఎంఎల్ఏ శంకర్ యాదవ్ ఉన్నా సరిగా పనిచేయటంలేదు. సొంత వ్యాపారాల పేరుతో ఎక్కువకాలం బెంగుళూరులోనే ఉంటున్నారు. దాంతో ఏ అవసరం వచ్చినా నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణినేతలు, క్యాడర్ రాష్ట్రపార్టీ వైపు లేకపోతే పక్క నియోజకవర్గాల వైపు చూస్తున్నారు. అందుకనే అన్నీ కోణాల్లో ఆలోచించిన చంద్రబాబు మరోమాజీ ఎంఎల్ఏ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రవీణ్ తో మాట్లాడి ఒప్పించే బాధ్యతలు జాతీయ ప్రధానకార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లు పార్టీవర్గాల సమాచారం. నల్లారి-ప్రవీణ్ మధ్య ఇప్పటికే చాలాసార్లు భేటలు జరిగాయట. ప్రవీణ్ అంటే ఎవరో కాదు ఒకపుడు టీడీపీలోనే నియోజకవర్గంలో ఎంఎల్ఏగా పనిచేసిన నతే. అంతేకాకుండా ప్రవీణ్ తల్లి లక్ష్మీదేవమ్మ కూడా రెండుసార్లు ఎంఎల్ఏగా పనిచేశారు. లక్ష్మీదేవమ్మ 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు. మొదటినుండి ఈ కుటుంబానికి నియోజకవర్గంలో గట్టి పట్టే ఉంది.

అయితే వివిధ కారణాల వల్ల ప్రవీణ్ 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి వైసీపీలోకి మారి అక్కడి నుండి పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ తరపున పోటీచేసిన శంకర్ యాదవ్ గెలిచారు. అయితే విచిత్రం ఏమిటంటే 2014లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన ప్రవీణ్ తర్వాత పార్టీలో యాక్టివ్ గా లేరు. అలాగే 2014లో గెలిచి 2019లో పోటీచేసిన శంకర్ యాదవ్ తర్వాత టీడీపీలో యాక్టివ్ గా లేరు.

2019 ఎన్నికల్లో శంకర్ పై వైసీపీ తరపున పోటీచేసిన పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి గెలిచారు. అప్పటినుండి నియోజకవర్గంలో ద్వారక బాగా యాక్టివ్ గానే ఉన్నారు. అందుకనే శంకర్ ను వదిలేసి ప్రవీణ్ ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రవీణ్ అయితేనే ద్వారకకు మంచి పోటీ ఇవ్వగలడని చంద్రబాబు అనుకుంటున్నారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.