కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. ఎన్నిక‌ల‌కు ముందు అకౌంట్లు ఫ్రీజ్‌!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్‌కు దెబ్బ‌మీద దెబ్బ ప‌డుతోం ది. ఇప్ప‌టికే ఇండియా కూట‌మి దాదాపు విచ్ఛిన్న‌మై పోయింది దీని నుంచి పార్టీ ఇంకా కోలుకోక ముందే.. అనూహ్యంగా పార్టీకి సంబందించిన 9 బ్యాంకు అకౌంట్ల‌ను ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ అకౌంట్ల‌న్నీ కూడా.. కాంగ్రెస్‌ అనుబంధ సంఘాలకు చెందినవే కావ‌డం గ‌మ‌నార్హం. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎన్నిక‌ల‌కు ముందు మోడీ త‌న ఓట‌మిని అంగీక‌రించిన‌ట్టు అయింద‌ని.. పార్టీ ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే విమ‌ర్శించారు.

ఇక‌, అధికారుల వాద‌న మ‌రోలా ఉంది. ఆదాయ పన్ను శాఖ పంపిన నోటీసులకు సదరు అనుబంధ సంఘాలు సరైన స్పందన ఇవ్వకపోగా.. జరిమానా కూడా చెల్లించలేదని.. దీంతో అకౌంట్లు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2018-19లో ఆదాయ పన్ను శాఖ విధించిన జరిమానా, నోటీసులకు ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు స్పందించ లేదని పేర్కొన్నారు. అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ విభాగాలకు సమాచారం పంపామ‌ని.. ముంద‌స్తు స‌మాచారం లేకుండా.. వీటిని ఫ్రీజ్ చేశామ‌న్న కాంగ్రెస్ విమ‌ర్శ‌లు స‌రికాద‌ని అధికారులు వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు.. కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజ‌య్ మాకెన్ స్పందిస్తూ.. బ్యాంకు ఖాతాలను నిలిపివేయ‌డం ఏం టని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ డబ్బును సైతం సీజ్ చేశారన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం లేదని.. అది సీజ‌కు గురైందని మాకెన్ దుయ్య‌బ‌ట్టారు. “మేం పంపిన చెక్కులు బ్యాంకులు క్లియ‌ర్ చేయ‌డం లేదు. ఫ్రీజ్ అయిన‌ట్టు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం మాద‌గ్గ‌ర చిల్లిగ‌వ్వ‌లేదు. ఇది ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ కార్య‌క‌లాపాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది. ఇలా చేయ‌డం.. రాజ్యాంగ విరుద్ధం. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ద‌మ‌వుతున్నాం” అని మాకెన్ వ్యాఖ్యానించారు. ఇదే విష‌యాన్ని.. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే కూడా వ్యాఖ్యానించారు.