‘5 ఏళ్లు గుడ్డి గుర్రాల‌కు ప‌ళ్లు తోమారా?’

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ ఏపీ చీఫ్ ష‌ర్మిల ఫైరయ్యారు. హైద‌రాబాద్‌ను మ‌రో రెండు సంవ‌త్స‌రాల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిని చేయాలంటూ.. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై తాజాగా స్పందించిన ష‌ర్మిల‌.. రెండేళ్ల పాటు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధానిగా కోర‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు.

‘ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా ? రాష్ట్రానికి రాజ‌ధానిని నిర్మించ‌డం చేతకాక ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? ఐదేళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా’ అని నిప్పులు చెరిగారు. ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ గ‌డువు తీరిపోతున్న ద‌రిమిలా.. ఇప్పుడు కొత్త వివాదాన్ని తెర‌మీదికి తెచ్చి.. పాత స‌మ‌స్య‌ల‌ను మ‌రుగున ప‌డేయాల‌న్న కుట్ర ఉంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రాజధాని లేదు. ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక ప్యాకేజీ లేవు. పోలవరం పూర్తి కాలేదని వ్యాఖ్యానించారు.

అప్పులు ఏం చేశారు?

జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన అప్పుల పైనా ష‌ర్మిల వ్యాఖ్య‌లు సంధించారు. “జ‌గ‌న‌న్న హ‌యాంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారు. అభివృద్ధి చూపలేదు .ప్రధాని మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదు” అని విమ‌ర్శించారు. 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే పరిస్థితి నెలకొందని.. దీనికి వైసీపీ నాయ‌కులు సిగ్గు ప‌డాల‌ని తీవ్ర‌స్థాయిలో మాట‌లు పేల్చారు.