175 సీట్ల‌కు 353 ద‌ర‌ఖాస్తులు.. కాంగ్రెస్ ప‌ట్టు పెరుగుతుందా!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ద‌ర‌ఖాస్తులు తీసుకుంటున్న ఏపీ కాంగ్రెస్‌కు తొలి రెండు రోజులు నిరాశే ఎదురైంది. అయితే.. త‌ర్వాత‌.. ష‌ర్మిల ఊపు.. మీడియా క‌థ‌నాల నేప‌థ్యంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి కూడా.. పోటీ పెరిగింది. మొత్తం 175 అసెంబ్లీ స్తానాల‌కు గాను.. ఇప్ప‌టి వ‌ర‌కు 353 ద‌రఖాస్తులు అందాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా క‌డ‌ప జిల్లాలోని క‌డ‌ప‌, పులివెందుల‌, మైదుకూరు, రాజంపేట వంటి స్థానాల‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో న‌లుగురేసి చొప్పున ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించారు. ఇక్క‌డ‌.. వైఎస్ కుటుంబంలో ఏర్ప‌డిన చీలిక‌లు, రాజంపేట జిల్లా కేంద్రం విష‌యంలో నెల‌కొన్న అసంతృప్తి, వైఎస్ ష‌ర్మిల ప్ర‌భావం వంటివి బాగా వ‌ర్క‌వుట్ అవుతాయ‌నే అంచ‌నాల‌తో ఎక్కువ మంది పోటీకి రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, గుంటూరు జిల్లాలోని అమ‌రావ‌తి ప్రాంతంలో ఉన్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా.. పోటీ ఎక్కువ‌గానే ఉంద‌ని తెలుస్తోంది. రాజ‌ధానిగా అమ‌రావతినే గుర్తిస్తామ‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ఈ త‌ర‌హా డిమాండ్ పెరిగింద‌నే అంచ‌నా వుంది.

అలాగే.. విజ‌య‌వాడ‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి ఏకంగా న‌లుగురు, తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ముగ్గురు ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించార‌ని స‌మాచారం. ఒక్క సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్న మాత్రం రిజ‌ర్వ్ చేసిన పెట్టార‌ని తెలిసింది. దీనిని వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న ఓ నేత‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఉభ‌య గోద‌వ‌రి జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్‌కు కొంత నిరాశ త‌ప్ప‌డం లేదు. ఇక్క‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్నింటికి ఇప్ప‌టికీ ద‌ర‌ఖాస్తులు రాలేదు.

అయితే.. ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ ప‌ట్నం నుంచి పుంఖాను పుంఖాలుగా ద‌ర‌ఖాస్తులు అందాయని చెబు తున్నారు. అదేవిధంగా విజ‌య‌న‌గ‌రం.. ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ కంచుకోట‌లో ఈసారి కూడా ద‌ర‌ఖాస్తులు ఎక్కువ‌గానే వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఇక‌, శ్రీకాకుళంలో మాత్రం రెండు కీల‌క స్థానాల‌కు ద‌ర‌ఖాస్తులు రెండునుంచి నాలుగు వ‌చ్చాయి. దీంతో ఆయా నియోజ‌వ‌ర్గాల నుంచి ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించిన వారిని ఎంపిక చేసే ప‌నిలో పార్టీ నాయ‌కులు ఉన్నారు. చివ‌ర‌కు.. ఎంత మందిని ఎంపిక చేస్తారో చూడాలి.