జ‌గ‌న‌న్నా.. నా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌గ‌ల‌వా?: ష‌ర్మిల‌

కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌.. వైఎస్ ష‌ర్మిల త‌న సోద‌రుడు, ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న ఆమె.. వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆమె జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? అంటూ నిల‌దీశారు. ఈ మేర‌కు కొన్ని ప్ర‌శ్న‌ల‌ను ఆమె పేర్కొన్నారు.

మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే…ఆయ‌న వారసుడుగా చెప్పుకొనే జగన్ అన్న‌ 6 వేలతో వేసింది “దగా డీఎస్సీ” అని వ్యాఖ్యానించారు. తాను ప్ర‌భుత్వ లోపాల‌ను ప్ర‌శ్నిస్తే త‌న‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు, మంత్రుల‌పై ఆమె మండిప‌డ్డారు. నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్ న్న, ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి అని వ్యాఖ్యానించారు.

ఇవీ.. ష‌ర్మిల సంధించిన ప్ర‌శ్న‌లు

  • 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ?
  • 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు ?
  • ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి ?
  • టెట్,డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ?
  • నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ? టెట్ కి 20 రోజులు,తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధి నా ?
  • వైఎస్‌ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా ?
  • ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ?
  • రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ?
  • మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా?