అసమ్మతి రాజుకుంటునే ఉందా ?

అధికారపార్టీ నరసరావుపేట నియోజకవర్గంలో అసమ్మతి రాజుకుంటునే ఉంది. ఇక్కడ ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా కొందరు నేతలు అంసతృప్తవాదులుగా తయారయ్యారు. వీళ్ళంతా ఏకంకాలేదు కాని ఎంఎల్ఏకి వ్యతిరేకంగా తమ గళాన్న గట్టిగానే వినిపిస్తున్నారు. గోపిరెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డిని కలిసినపుడు పదేపదే కోరుతున్నారు. అయితే గోపిరెడ్డికి టికెట్ ఇస్తానని కాని ఇవ్వనని కాని జగన్ నుండి నేతలకు ఎలాంటి సంకేతాలు అందలేదు. దాంతో నరసరావుపేటలో ఏమి జరుగుతున్నదో ఎవరికీ అర్ధంకావటంలేదు.

ఒకవైపు గోపిరెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మరో నేత గజ్జెల బ్రహ్మానందరెడ్డి తనకు తాను టికెట్ ప్రకటించేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేయబోయేది తానే అని నియోజకవర్గమంతా ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో మిగిలిన నేతలు, క్యాడర్లో అయోమయం పెరిగిపోతోంది. 2014,19 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అభ్యర్ధులపై గెలిచిన గోపిరెడ్డి 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంఎల్ఏ వ్యవహారశైలిపై పార్టీలోని కొందరు నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.

పార్టీలోని నేతల్లో ఎంఎల్ఏపైన ఉన్న అసంతృప్తి నియోజకవర్గంలో జనాల్లో కూడా ఉందా లేదా అన్నది తెలీటంలేదు. చాలాకాలంగా గజ్జెల వర్గానికి గోపిరెడ్డితో పడటంలేదు. నిజానికి 2014లోనే గజ్జెల నరసరావుపేటలో పోటీచేయాల్సింది. టికెట్ ఖాయమైపోయిందని అనుకన్న సమయంలో సడెన్ గా గోపిరెడ్డి ఎంట్రీ ఇచ్చి టికెట్ ఎగరేసుకుపోయారు. అప్పటినుండి ఇద్దరి మధ్య గొడవలు అవుతునే ఉన్నాయి. తనంటే మండిపోతున్న గజ్జెలను సర్దుబాటు చేసుకునేందుకు ఎంఎల్ఏ కూడా పెద్దగా ప్రయత్నించలేదు. పైగా గజ్జెల వర్గాన్ని మరింతగా ఇబ్బందులు పెడుతున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది.

అందుకనే రాబోయే ఎన్నికల్లో గోపిరెడ్డికి టికెట్ దక్కనీయకూడదని తాను పోటీచేయాలని బ్రహ్మారెడ్డి మహా పట్టుదలగా పనిచేస్తున్నారు. గోపిరెడ్డి వ్యతిరేకులందరినీ తనకు మద్దతుగా ఏకతాటిపైకి తెచ్చుకుంటున్నారు. గెలుపు మీద నమ్మకంతోనే జగన్ను కలిసి టికెట్ తనకే ఇవ్వాలని గట్టిగా కోరారు. ఈ పరిస్దితుల్లో గజ్జెలకు టికెట్ ఇస్తే గోపిరెడ్డి ఏమిచేస్తారు ? గోపిరెడ్డికే టికెట్ ఖాయమైతే గజ్జెల వర్గం ఏమిచేస్తుందో తెలీటం లేదు. చివరకు జగన్ నిర్ణయం ఎలాగుంటుందో చూడాలి.