ఒక్క ఉచితం.. ఎన్ని తిప్ప‌లు పెడుతోంది!

రాజ‌కీయ పార్టీలు ఉచిత హామీలు ఇచ్చేందుకు, ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ఎంతో ఉబ‌లాట ప‌డుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే.. వైసీపీ అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి త‌దిత‌ర ప‌థ‌కాల‌కు దీటు గా తాము మ‌రిన్ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని టీడీపీ చెబుతోంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఉచితాల బాట ప‌డితే ఎలా ఉంటుందో.. ఏం జ‌రుగుతుందో.. ఏపీనే ఉదాహ‌ర‌ణ‌. ఏపీలో ప్ర‌భుత్వం అప్పుల‌పై అప్పులు చేస్తోంది. కానీ, ఈ నిదుల‌ను ప్ర‌జ‌ల‌కు పంచుతున్నారే త‌ప్ప‌.. ఎలాంటి ఆదాయ మార్గాల‌కూ వెచ్చించ‌డం లేదు.

ఈ విష‌యాన్ని ఏపీ ప్ర‌భుత్వ‌మే చెబుతోంది. పోనీ.. ఏపీ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టినా.. ప‌ట్టుమని అధికారంలో కి వ‌చ్చి మూడు నెల‌లు కూడా నిండ‌ని.. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా.. ఆప‌శోపాలు ప‌డుతోంది. ఇది విమ‌ర్శ కాదు.. క్షేత్ర‌స్థాయిలో వాస్త‌వం. ఒక ఉచితానికి తోడు అనుబంధంగా అనేక ఉచితాలు ప్ర‌క‌టించాల్సి రావ‌డం .. రాష్ట్ర ప్ర‌భుత్వానికి గోరుచుట్టుపై రోక‌లి పోటు అన్న చందంగా మారిపోయింది. అయితే.. ఇక్క‌డ ఆశించ‌దగిన ప‌రిణామం.. ఏంటంటే.. హైద‌రాబాద్ వంటి పాడికుండ ఉండ‌డం.. ఆదాయం ఆగ‌కుండా వ‌స్తుండ‌డం.

ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌హాలక్ష్మి ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ ప‌థ‌కం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా మ‌హిళ‌ల‌కు బ‌స్సు ర‌వాణా సౌక‌ర్యాన్ని క‌ల్పించారు. మహాలక్ష్మి పథకానికి ఎనలేని ఆదరణ లభిస్తోంది.. మహిళలు రోజూ లక్షల్లో బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వంపై రోజుకు 10 నుంచి 15 కోట్ల రూపాయ‌ల భారం ప‌డుతోందని అధికారులు చెబుతున్నారు. స‌రే.. ఇది ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్దానం కాబ‌ట్టి.. త‌ప్ప‌డం లేదు. కానీ, అదేస‌మ‌యంలో ఇప్పుడు దీనికి అనుబంధంగా మ‌రిన్ని ఉచితాలు అమ‌లు చేయాల్సి వ‌చ్చింది.

వీటిని ఎన్నిక‌ల‌కు ముందు హామీ రూపంలో ఇవ్వ‌క‌పోయినా.. ప్ర‌భుత్వానికి త‌ప్ప‌డం లేదు. కార‌ణం.. మ‌హాల‌క్ష్మి ఉచిత ప‌థ‌కం కార‌ణంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 ల‌క్ష‌ల పైచిలుకు ఆటో డ్రైవ‌ర్లు.. 70 వేల మంది క్యాబ్ డ్రైవ‌ర్లు.. ఉపాధి కోల్పోయే ప‌రిస్తితికి చేరుకున్నారు. దీంతో మహాలక్ష్మి పథకం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని ఇటీవల ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఏటా ఆటో డ్రైవ‌ర్ల‌కు 12000 రూపాయ‌లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వంసిద్ధ‌మైంది. ఇంతే మొత్తాన్ని క్యాబు డ్రైవ‌ర్ల‌కు కూడా ఇవ్వ‌నున్నారు. ఇది వాస్త‌వానికి అద‌న‌పు భారం. అయినా.. ఒక ఉచితాన్ని అమలు చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. అనుబంధంగా ఎదురైన ఈభారం ప్ర‌బుత్వానికి త‌ప్ప‌డం లేదు. ఏదేమైనా.. ఉచిత ప‌థ‌కాలు ఎంత భారం మోపుతాయ‌నేది ఇదొక ఉదాహ‌ర‌ణ‌. మ‌రి రాజ‌కీయ నాయ‌కులు ఇప్ప‌టికైనా.. త‌మ‌ పంథాను వీడుతారేమో చూడాలి.