ఐదేళ్ల పాల‌న త‌ర్వాత కూడా.. వైఎస్ బొమ్మ వాడుకుంటారా?

ఏపీ అధికార పార్టీ వైసీపీపై వైఎస్ ఆత్మ‌గా రాజ‌కీయాల్లో గుర్తింపు పొందిన మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత కేవీపీ రామచంద్ర‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఐదేళ్ల త‌ర్వాత కూడా ఇంకా వైఎస్ బొమ్మ‌ను వాడుకుంటారా? అని ఆయ‌న నిల‌దీశారు. “ప‌థ‌కాలు అమ‌లు చేశాం.. సంక్షేమం అమ‌లు చేశాం. ల‌క్ష‌ల కోట్లు అప్పులు తెచ్చి మ‌రీ.. ప్ర‌జ‌ల‌కు పంచామ‌ని చెబుతున్న వైసీపీ ఇంకా వైఎస్ ఫొటోతోనే ఎన్నిక‌ల‌కు వెళ్ల డం ఎందుకు? ఇలా చేస్తున్నందుకు జ‌గ‌న్ సిగ్గుప‌డాలి” అని కేవీపీ వ్యాఖ్యానించారు.

ఢిల్లీకి వెళ్లి ఏం తెచ్చారు?

ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనేన‌ని కేవీపీ వ్యాఖ్యానించారు. కానీ.. వెళ్లిన ప్ర‌తిసారీ ట్రావెలింగ్ చార్జీలు దండ‌గ అవుతున్నాయే త‌ప్ప‌.. ఒరిగింది.. ఈరాష్ట్రానికితెచ్చింది ఏంటని ఆయ‌న నిల‌దీశారు. జ‌గ‌న్ ప్ర‌యాణ ఖ‌ర్చులు ల‌క్ష‌ల్లో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ సొమ్ముతో ప‌ది కిలో మీట‌ర్ల రోడ్డు వేయొచ్చ‌న్నారు. ఇసుక, మద్యం కుంభకోణాల్లో దేశంలో చాలా మంది నేతలను అరెస్టు చేశారని. ఏపీలోని నేతలను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్ర‌శ్నించారు.

బీజేపీ దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటా? అని స‌టైర్లు వేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఇంత అవినీతి జ‌రుగుతున్నా.. ఏ మంత్రి పైనా, ఎంపీలపైనా కేసులు, అరెస్టులు ఎందుకు పెట్టలేదో బీజేపీ చెప్పాలని కేవీపీ డిమాండ్ చేశారు. ఏపీలో విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం అక్ర‌మ‌ విక్రయాలు జరుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్టు చేసిన ఈడీ ఏపీలో మంత్రులను ఎందుకు వదిలేసిందన్నారు.

పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం…ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటోందని దుయ్య‌బ‌ట్టారు. పోలవరం బ్యారేజీలా మిగిలిపోకూడదన్న ఆయన కేంద్రం నుంచి ఏం సాధించుకొని వచ్చారో చెప్పాలన్నారు. సొంత తల్లి, చెల్లిని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. సీట్ల పంపకం, స్వీట్లు పంచుకోవడం, వాటాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి జ‌గ‌న్‌కు ప‌ట్ట‌డం లేద‌న్నారు.