ఉమ్మ‌డి పౌర‌స్మృతి అమ‌ల్లోకి.. తొలి రాష్ట్రంగా రికార్డ్‌

ఉమ్మ‌డి పౌర‌స్మృతిని అమ‌లు చేయ‌నున్న తొలి రాష్ట్రంగా దేవ‌భూమి ఉత్త‌రాఖండ్ రాష్ట్రం నిలుస్తోంది. ఇటీవ‌ల రాష్ట్ర సీఎం పుష్క‌ర సింగ్ ధామీ ప్ర‌భుత్వం ముసాయిదా బిల్లును రూపొందించింది. తాజాగా జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో దీనిని మంగ‌ళ‌వారం ప్ర‌వేశ పెట్టేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే.. దీనికి విప‌క్షాల నుంచి అడ్డు త‌గిలింది. దీనికి రెండు కీల‌క‌మైన అంశాలు అవ‌రోధంగా మారాయి. ఒక‌టి.. స‌హ‌జీవ‌నం విష‌యంలో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు.. ఆస్తుల పంప‌కం. ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. దాదాపు బిల్లుకు బుధ‌వారం అసెంబ్లీ ఓకే చెప్పేసింది. దీంతో దేశంలో ఉమ్మ‌డి పౌర‌స్మృతి అమ‌లు చేస్తున్న తొలిరాష్ట్రంగా ఉత్త‌రాఖండ్ నిలిచింది.

మోడీ ఉత్సాహం..

2014లో కేంద్రంలో కొలువుదీరిన న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. అప్ప‌టి నుంచి ఉమ్మ‌డి పౌర‌స్మృతిని అమ‌లు చేయాల‌ని భావిస్తూనే వ‌చ్చింది. అయితే.. కొన్ని కార‌ణాల‌తో దీనిని ప‌క్క‌న పెట్టింది. అయితే, 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి ఉమ్మ‌డి పౌర్మృతిని ఏకంగా మేనిఫెస్టోలోనూ చేర్చారు. ఇలా.. కొన్నిద‌శాబ్దాలుగా నిద్రాణంగా ఉన్న ఉమ్మ‌డి పౌర‌స్మృతి వ్య‌వ‌హారం.. బీజేపీ హ‌యాంలో అనేక విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు, వాద ప్ర‌తివాదాల న‌డుమ పార్ల‌మెంటుకు చేరింది. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై 2023లో కేంద్రం దూకుడు పెంచింది. న‌వంబ‌రులో ఉమ్మ‌డి పౌర‌స్మృతిని కేంద్రం అంగీక‌రించింది. అయితే.. దీనిని అమ‌లు చేసుకునేందుకు ఎలాంటి గ‌డువు విధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో దీనిని రాష్ట్రాల‌కు వ‌దిలివేసింది.

ఏంటీ ఉమ్మ‌డి పౌర‌స్మృతి?

ఉమ్మడి పౌర స్మృతి చాలా క్లిష్టమైన విషయం. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలైన పెళ్లి, విడాకులు, ఆస్తి పంప కాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడమే యూనిఫార్మ్ సివిల్ కోడ్. దేశంలో ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో ఒకే ఒక చట్టాన్ని తీసుకురావడమే దీనిని ఉద్దేశం.

రాజ్యాంగంలోనూ ఆర్టికల్ 44లో ఈ ఉమ్మడి పౌర స్మృతిని ప్రస్తావించారు. దేశ ప్రజల ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు. అయితే.. ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని గ్రహించిన రాజ్యాంగ రూపకర్తలు.. యూసీసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చారు. అయితే.. వీటిలో కొన్నింటికి ఇప్పుడు తెచ్చిన చ‌ట్టంలో చోటు క‌ల్పించ‌లేద‌న్న‌ది విప‌క్షాల ఆరోప‌ణ‌లు. ఏదేమైనా బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్త‌రాఖండ్‌లో అమ‌లు చేయ‌డం ద్వారా ఇత‌ర రాష్ట్రాల్లోనూ దీనిని తీసుకువ‌చ్చే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని పరిశీల‌కులు భావిస్తున్నారు.