భగీరథలో వేల కోట్ల అవినీతి జరిగిందా ?

మిషన్ భగీరథ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుండి. మిషన్ భగీరథ పేరుతో కేసీయార్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు చాలా ప్రాంతాల నుండి ప్రభుత్వానికి పిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. ఫిర్యాలన్నింటినీ రేవంత్ రెడ్డి ముందుంచారు ప్రభుత్వ అధికారులు. వీటిని పరిశీలించిన రేవంత్ వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

కేసీయార్ అధికారంలో ఉన్నపుడు ఈ పథకంపై అనేక ఆరోపణలున్నాయి. అయితే అప్పట్లో దేనిపైనా ప్రభుత్వం స్పందించలేదు. అలాంటిది ప్రభుత్వం మారగానే ఫిర్యాదులు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయట. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత తక్కువలో తక్కువ రు. 7 వేల కోట్ల అవినీతి జరిగుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకనే అవినీతి ఎంతన్నది నిగ్గుతేల్చేందుకే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ప్రతి ఊరికి పైప్ లైన్ వేసి ఇంటింటింకి మంచినీటి సౌకర్యం అందించేందుకు ఏర్పాటైందే మిషన్ భగీరధ ప్రాజెక్టు.

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడేటప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి సౌకర్యం ఉంది. గ్రామాల మధ్య పైపులైన్లు వేసి ఇంటింటికి నల్లాలు బిగించటం ఒకటే మిగిలింది. ఇక్కడే అవినీతికి తెరలేచిందట. ఎలాగంటే పైప్ లైన్లు వేయకుండానే వేసినట్లు బిల్లులు పెట్టుకున్నారట. మెటీరియల్ కొనకుండానే కొన్నట్లు ఫేక్ బిల్లులు చూపి డబ్బులు తీసుకున్నారట. ఇంట్రా విలేజ్ వర్క్స్ లో పెద్దఎత్తున గోల్ జరిగినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ప్రతిమండలంలోని ఒక గ్రామాన్ని శాంపుల్ గా తీసుకోవాలని విజిలెన్స్ ను రేవంత్ ఆదేశించారట. గ్రామాల మధ్య అప్పటికే ఉన్న పైప్ లైన్లను కొత్తగా వేసినట్లు చూపించి వేలకోట్ల రూపాయల బిల్లులు కాజేసినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో పథకాన్ని పర్యవేక్షించిన ఉన్నతాధికారి పాత్రపైన కూడా ఆరోపణలు వినబడుతున్నట్లు సమాచారం. అందుకే వీటన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపించాలని రేవంత్ ఆదేశించింది. ప్రాజెక్టు కోసం 30 వేల కోట్ల రూపాయలను కేసీయార్ ప్రభుత్వం అప్పుచేసినట్లు లెక్కలు చెబుతోంది. మరి ఎంత సద్వినియోగం అయ్యింది ఎంత అవినీతి జరిగిందన్నది తేలాలి.