మీరు బ‌ట‌న్ నొక్కితే.. జ‌గ‌న్ మైండ్ బ్లాంక్ కావాలి: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. “ఆయ‌న బ‌ట‌న్ నొక్కుతున్నాను.. బ‌ట‌న్ నొక్కుతున్నాను. అంటున్నారు. కానీ, మీరు బ‌ట‌న్ నొక్కితే ఆయ‌న మైండ్ బ్లాంక్ కావాలి. అలా నొక్కాలి” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పార్టీ గెలుపే ముఖ్యంగా చంద్ర‌బాబు.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రా..క‌ద‌లిరా!పేరుతో నిర్వ‌హిస్తున్న ఈ స‌భ‌ల్లో వైసీపీపై ఆయ‌న తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది తన జీవితాశయమని తెలిపారు.

వైసీపీను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్ర‌బాబు అన్నారు. “సిద్ధం.. సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం.? అని ప్ర‌శ్నించారు. ఆయ‌న‌ను ఇంటికి పంపించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. రాతియుగం వైపు ఏపీ వెళ్లకుండా స్వర్ణయుగం వైపు వెళ్లాలనేది త‌న వుద్దేశ‌మ‌ని చెప్పారు. కానీ, ఇప్పుడు ఎటు చూసినా.. రాతి యుగం నాటి ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌న్నారు. ఎక్క‌డిక‌క్క‌డ దోపిడీ, దౌర్జ‌న్యాలు పెరిగిపోయాయ‌ని అన్నారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోతామని తెలిసి జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

అందుకే ఇటీవ‌ల ఆయ‌న దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు అని చంద్ర‌బాబు తెలిపారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలు పెరిగిపోయాయన్నారు. ఎక్క‌డ చూసినా దారుణాలే క‌నిపిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయ‌కుడు కొంద‌రు దాడులు చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను భయ భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఏపీలో ఉపాధి లేక వలస వెళ్లే దుస్థితి ఉందన్నారు. “జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక్క త‌ట్ట మ‌ట్టి పోసి.. ఒక్క ప్రాజెక్ట‌యినా క‌ట్టాడా? ఉపాధి ఎక్క‌డ ఉంటుంది” అని విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాగా, వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని చంద్ర‌బాబు అన్నారు. ఎవ‌రైనా స‌రే ప్రజలకు సేవ చేయాలని, అదే తాము కోరుతున్నామ‌ని చెప్పారు. వలంటీర్లు వైసీపీకి సేవ చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టేది లేద‌న్నారు. అదే ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తే.. స‌త్క‌రిస్తామ‌ని తెలిపారు. జగన్‌ను నమ్ముకుంటే వలంటీర్లు జైలుకు వెళ్లాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. టీడీపీ అధికారంలోకి వస్తే.. వలంటీర్ ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. తీసేయ‌బోమ‌ని మ‌రింత‌గా వారిని తీర్చిదిద్దుతామ‌ని అన్నారు.