జనసేనలోకి ముద్రగడ..మాగంటితో భేటీ

ఏపీలో శాసన సభ ఎన్నికలకు ముందు వైసీపీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా టీడీపీ-జనసేన కూటమికి మద్దతు తెలపడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లయింది. వైసీపీలో తప్ప మరే పార్టీలో అయినా చేరతా అంటూ ముద్రగడ చెప్పడం…వైసీపీపై ఆయనకున్న వ్యతిరేకతను చెప్పకనే చెబుతోంది. ఈ క్రమంలోనే తాజాగా

ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు నివాసానికి ముద్రగడ పద్మనాభం వెళ్లడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికలపై ఈ ఇద్దరు నేతలు చర్చించారని తెలుస్తోంది.

ముద్రగడ పద్మనాభం తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని, ఆయనతో వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని అన్నారు. తాము కాంగ్రెస్ లో కలిసి చేశామని, ఆ తర్వాత టీడీపీలో చేరి పదవులు అనుభవించామని వెల్లడించారు. ముద్రగడ టీడీపీలోకి వచ్చినా….జనసేనలో చేరినా పర్వాలేదని ముద్రగడకు తాను చెప్పానని మాగంటి అన్నారు. అయితే, వపన్ కల్యాణ్ ను కలవబోతున్నానని, జనసేనలో చేరుతానని ఆయన తనతో చెప్పారని మాగంటి వెల్లడించారు.

టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే తామంతా కలిసి పని చేస్తామని మాగంటి చెప్పారు. వైసీపీ తనను మోసం చేసిందని, రాజ్యసభ సీటు ఇస్తామని ఆశజూపారని ముద్రగడ వాపోయారని అన్నారు. వందల కోట్ల రూపాయలు తనలాంటి వారి దగ్గర ఎక్కడుంటాయని ముద్రగడ అన్నారని చెప్పారు. వైసీపీలోకి వెళ్తే అమ్ముడుపోయానని అంటారని, ఇప్పటికే తనకొక గాయం తగిలిందని, ఆ గాయం మానేంత వరకు జనసేనలో ఉంటానని ముద్రగడ చెప్పారని మాగంటి అన్నారు.