జ‌గ‌న్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లోని మాడుగుల నియోజ‌కవర్గంలో తాజాగా నిర్వ‌హించిన రా.. క‌ద‌లిరా! స‌భ‌లో చంద్ర‌బాబు ఆసాంతం తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. “మీకోసం బ‌ట‌న్ నొక్కుతున్నాను.. అని దొంగ మాట‌లు చెబుతున్నాడు. ఆయ‌నేమ‌న్నా.. ఆయ‌న జేబులో ముల్లె మీకు పంచుతున్నాడా? బ‌ట‌న్ నొక్క‌డం ద్వారా ప్ర‌తి మ‌హిళ‌కు, ప్ర‌తి కుటుంబానికి రూ.8 ల‌క్ష‌ల మేర‌కు ముంచేశాదు. ఇలాంటి సీఎం మ‌న‌కు అవ‌స‌ర‌మా? ” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

జ‌గ‌న్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా.. అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. మూడు ప్రాంతాల్లోనూ ప్ర‌జ‌లు ఆయ‌న ఫ్యాన్ కు ఉన్న మూడు రెక్క‌ల‌ను విరిచేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, రెక్క‌లు లేని మొండి ఫ్యాన్‌ను జ‌గ‌న్‌కు రిట‌ర్న్ గిఫ్ట్‌గా ఇచ్చి.. టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.

ఆర్టీసీ బ‌స్సుల్లో ఎక్క‌డ నుంచి ఎక్క‌డికైనా మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణంచేసే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తామన్నారు. విశాఖ‌ను తాను అభివృద్ధిచేస్తే.. లూలూ వంటి కంపెనీల‌ను శ్ర‌మ‌కోర్చి తీసుకువ‌స్తే.. జ‌గ‌న్ వారిని త‌రిమి కొట్టి వారికి కేటాయించిన భూముల‌ను దోచుకున్నాడ‌ని ఆరోపించారు. విశాఖ‌లో ఎక్క‌డ అభివృద్ధి జ‌రిగిందో చెప్పాల‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌న‌డానికి ఇంత‌క‌న్నా ఉదాహ‌ర‌ణ ఏం కావాల‌నిఆయ‌న ప్ర‌శ్నించారు.

ప్ర‌భుత్వ అరాచ‌కాలు.. ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్ప‌డానికి ఎస్సీ డ్రైవ‌ర్‌ను చంపేసి.. ఇంటికి శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేయ‌డ‌మే ఉదాహ‌ర‌ణ‌గా చంద్ర‌బాబు చెప్పారు. తాను విశాఖ‌కు తెచ్చిన కంపెనీల‌ను ఏ ఒక్క‌దానినీ బ‌త‌క‌నివ్వ‌లేద‌న్నారు. దోచుకోవ‌డం త‌ప్ప‌.. జ‌గ‌న్‌కు ఉత్త‌రాంధ్ర‌పై ఎలాంటి ప్రేమా లేద‌న్నారు. గంజాయి అమ్ముతూ.. ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో దొరికిపోయార‌ని, త‌హ‌సీల్దార్ ర‌మ‌ణ‌య్య‌ను దారుణంగా ఆయ‌న ఇంట్లోనే చంపేశార‌ని.. అస‌లు రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఉన్నాయా? అని చంద్ర‌బాబు నిల‌దీశారు. జ‌గ‌న్ ఇచ్చే ప్ర‌తి రూపాయి.. ప్ర‌జ‌ల‌ద‌ని, లేక‌పోతే..కేంద్రం ఇస్తోంద‌ని వ్యాఖ్యానించారు.