కేడ‌ర్‌లో కాక‌.. ఒంగోలు మార్పుతో న‌ష్ట‌మేనా?

Chevireddy Bhaskar Reddy
Chevireddy Bhaskar Reddy

వైసీపీ కేడ‌ర్‌లో కాక ప్రారంభ‌మైంది. ఆయ‌నకుఎలా టికెట్ ఇస్తారంటూ.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. వినిపిం చిన గుసుగుస‌లు ఇప్పుడు నినాదాలుగా మారుతున్నాయి. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క‌మైన ఒంగోలు పార్ల‌మెంటు స్థానాన్ని మార్చేందుకు వైసీపీ అధిష్టానం ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. వివిధ కార‌ణాల‌తో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వ‌బోమ‌ని పార్టీ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలోప‌లువురి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.

తొలుత మంత్రి రోజాను ఇక్క‌డ‌నుంచి పోటీకి పెట్టాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ, ఆమె విముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. నేరుగా సీఎంను సంప్ర‌దించి ఈ ప్ర‌తిపాద‌న నుంచి త‌న పేరును తీసేయించుకు న్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించిం ది. అయితే..నేరుగా ఆయ‌న‌ను ఒంగోలు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప్ర‌క‌టించ‌లేదు. దీంతోచెవిరెడ్డి ఇక్క‌డ ఇల్లు తీసుకుని.. త‌న ప‌నిని ప్రారంభించారు.

ఇదే ఇప్పుడు కేడ‌ర్‌లో కాక పెంచేలా చేసింది. ఎక్క‌డ నుంచో నాయ‌కుడిని తెచ్చితమపై ఎలా రుద్దుతా ర‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, ఒంగోలు పార్ల‌మెంటు ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలను గ‌మ‌నిస్తే.. ఎర్ర‌గొండ‌పాలెం, కొండ‌పి, ద‌ర్శి, ఒంగోలు, మార్కాపురం, గిద్ద‌లూరు, క‌నిగిరి ఉన్నాయి. వీటిలోనూ పార్టీ మార్పులు చేసింది. ముఖ్యంగా క‌నిగిరిలో సిట్టింగుకు సీటు ఇవ్వ‌లేదు. అదేవిధంగా ద‌ర్శిలోనూ మొండిచేయి చూపింది. దీంతోఅక్క‌డి పార్టీ కేడ‌ర్‌.. ఈ విష‌యంపై ర‌గిలిపోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ద‌ర్శిలోఏదో విధంగా మేనేజ్ చేసేందుకు బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, ద‌ర్శిలో కుదిరేలా క‌నిపించ‌డం లేదు. ఇక, ఎర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే క‌మ్ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ను కొండ‌పికి పంపించారు. మార్కాపురానికి గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నారాంబాబును కేటాయించారు. ఈ మార్పుల‌పై కేడ‌ర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్న స‌మ‌యంలోనే అనూహ్యంగా ఒంగోలుకు చెవిరెడ్డిని తీసుకురావ‌డంతో మ‌రింతగా ఆందోళ‌న చేస్తున్నారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధం లేని నాయ‌కుడిని తెలా తెస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

పైగా ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీని గెలిపించుకునే బాధ్య‌త ఒక‌ప్పుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా తీసుకున్నారు. మాగుంట‌కు టికెట్ ఇవ్వ‌బోమ‌ని చెప్పేస‌రికి ఆయ‌న కూడా త‌న బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఒంగోలు మిన‌హా(ఇక్క‌డ బాలినేని ఉంటే) ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్య‌త చెవిరెడ్డిపై ప‌డింది. కానీ, కేడ‌ర్‌లో మాత్రం అసంతృప్తి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఏం చేస్తార‌నేది వైసీపీలో చ‌ర్చ‌గామార‌డం గ‌మ‌నార్హం.