నిర్మ‌ల‌మ్మ బ‌డ్జెట్ .. ఎవ‌రికీ ఏదీ ఉచితం కాదు!

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి ఏప్రిల్‌, మే, జూన్‌ నెల‌ల‌కు మధ్యంతర బ‌డ్జెట్‌ను తీసుకువ‌చ్చింది. అయితే.. బ‌డ్జెట్‌ను స‌మ‌గ్రంగా అర్థం చేసుకున్నా.. పూర్తిగా అర్థ‌మ‌య్యే కోణంలో విన్నా.. ఇది ఎన్నికల తాయిలాల బ‌డ్జెట్ గానే భావిస్తోంది. అన్ని వ‌ర్గాల‌కు మేలు చేస్తున్నామ‌ని చెబుతూ.. ప్ర‌క‌టించిన ఈ బ‌డ్జెట్‌లో నిజంగానే మేలు ప్ర‌క‌టించారు. కానీ, అది పూర్తిస్థాయిలో కాకుండా.. అన్నీ అప్పులు.. రుణాలు.. వ‌డ్డీలేని రుణాలు, సాయాలుగానే ఉన్నాయి.

స‌హజంగా ఎన్నిక‌లు అన‌గానే ఉచితాల‌కు పెద్ద‌పీట వేసే సంస్కృతి ఉంది. కానీ, తాజా బ‌డ్జెట్‌లో ప్ర‌క‌టించిన వాటిని గ‌మ‌నిస్తే.. ఎవ‌రికీ ఏదీ ఉచితం కాదు అనే చెప్పారు. మొత్తం బడ్జెట్ ఈ మూడు మాసాల కాలానికీ రూ.47.66 ల‌క్ష‌ల కోట్లుగా ప్ర‌తిపాదించారు. దీనిలోనూ మొత్తంగా ఆదాయం.. అది ప‌న్నులు, సెస్సులు, సుంకాలు ఏవైనా కావొచ్చు.. రూ.30.80ల‌క్ష‌ల కోట్లుగా నిర్మ‌ల‌మ్మ పేర్కొన్నారు. అంటే.. బాగానే పిండేయ‌నున్నారని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇక‌, ప్ర‌జ‌ల విష‌యానికి వ‌స్తే.. మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌ల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. పైన చెప్పుకొన్న‌ట్టు ఏదీ ఊరికేనే వీరికి ఇవ్వ‌డం లేదు. అయితే.. ఇంటి నిర్మాణానికి సంబంధించిన రుణాల‌ను అందించ‌నున్నా రు. నిజానికి ఇప్ప‌టికే పీఎం ఆవాస్ యోజ‌న కింద రూ.2ల‌క్ష‌ల వ‌రకు రుణ మిన‌హాయింపు ఉంది. దీనిని పెంచ‌కుండా.. దానినే కంటిన్యూ చేస్తామ‌ని చెప్పిన‌ట్టు అయింది. అయితే.. మ‌రోవైపు బ్యాంకుల వ‌డ్డీల‌కు ఎక్క‌డా అడ్డుక‌ట్ట వేస్తామ‌ని చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

యువ‌త‌కు ఉప్పుడున్న ఉపాధి చాల‌న్న‌ట్టుగా కొత్త ఎలాంటి ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎంల‌ను ఏక‌రువు పెట్టారు. ఇక‌, రైతుల‌కు పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని పెంచుతార‌ని అంద‌రూ అనుకున్నా.. ఒరిగింది శూన్యం. ఎక్క‌డా ఆ మాట కూడా వినిపించ‌లేదు. కొత్త గిడ్డంగులు నిర్మించాల‌న్న దేశ‌వ్యాప్త రైతాంగం ఘోష కంఠ శోష‌గా మారింది. దీనికి సంబంధించి ప్రైవేటీక‌ర‌ణ‌కు పెద్ద పీట వేస్తూ.. ఆర్థిక సాయం చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. అంటే.. రైతులు త‌మ ఉత్ప‌త్తులు దాచుకునేందుకు ప్రైవేటును ఆశ్ర‌యించాల్సి వస్తుండ‌డం గ‌మ‌నార్హం.