మోడీతో సెల్ఫీ..తీసుకోక తప్పదు!

నిజ‌మే.. ఇది ఒక ప‌థ‌కం కింద అమ‌లు చేస్తున్నారు. త‌ప్ప‌నిస‌రి కూడా చేశారు. సాక్షాత్తూ… కేంద్ర ఆహార , వినియోగ‌, స‌ర‌ఫ‌రాల శాఖ ఈ మేర‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు కూడా.. స‌మాచారం పంపించింది. మోడీతో సెల్ఫీని తప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల‌ని.. దీనిని మొక్కుబ‌డి తంతుగా మాత్రం పూర్తి చేయొద్ద‌ని కూడా ఆదేశించడం గ‌మ‌నార్హం. దీనిపై క‌లెక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ కూడా ఉండాల‌ని పేర్కొంది.

ఏంటీ మోడీతో సెల్ఫీ..

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ.. రేష‌న్ బియ్యాన్ని స‌ర‌ఫ‌రా చేస్తారు. పేద‌రిక రేఖ‌కు దిగువ‌న‌.. ఎగువ‌న ఉన్న వారికి రేష‌న్ దుకాణాల్లో బియ్యం, కందిప‌ప్పు, ఆయిల్‌, చ‌క్కెర వంటివాటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇది రాష్ట్రాల్లో ఖ‌చ్చితంగా అమ‌ల‌వుతున్న విధానం. అయితే.. ఈ బియ్యం విష‌యంలో క‌రోనా అనంత‌రం.. కేంద్ర‌మే జోక్యం చేసుకుని.. ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇంత‌కుముంద రూ.1కి బియ్యం ఇచ్చేవారు . ఇప్పుడు అది కూడాలేదు.

అంత్యోద‌య అన్న యోజ‌న ప‌థ‌కం కింద‌.. కేంద్రం రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి కుటుంబానికి త‌ల‌కు 5 కిలోల చొప్పున బియ్యం, గోధుమ‌లు, నూనె, చ‌క్కెర‌ల‌ను పంపిణీ చేస్తున్నారు. కేంద్రం అమ‌లు చేస్తున్న ఉచిత బియ్యం పథకం ఈనెల నుంచి ఐదేళ్లకు పొడిగించారు. ఇది కొన్ని కోట్ల మందికి(20 కోట్లని అంచ‌నా) చేర‌నుంది. దీంతో దీనిని ఎన్నిక‌ల అస్త్రంగా మార్చుకునేందుకు మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నించింది.

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ఉచిత బియ్యం పథకాన్ని ప్రజలకు తెలిసేలా దేశవ్యాప్తం గా రేషన్‌ దుకాణాల్లో ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ.. ఫొటో ఉన్న సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేస్తారు. రేష‌న్ బియ్యం తీసుకున్న మ‌హిళ లేదా.. పురుషుడు.. బియ్యం తీసుకున్నాక‌.. వెంట‌నే అదే దుకాణంలో ఏర్పాటు చేసిన మోడీ సెల్ఫీ పాయింట్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని స్థానికంగా ఉన్న అధికారుల‌కు అందించాల‌ని కూడా కేంద్రం సూచించింది.