ఒక్కొక్కళ్ళు మీటవుతున్నారు…ఏంటి విషయం ?

తెలంగాణా రాజకీయాల్లో రోజుకో డెవలప్మెంట్ జరుగుతోంది. రేవంత్ రెడ్డితో ఆదివారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఈమధ్యనే ప్రకాష్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కలిసిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళిన మంత్రి దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ఏమి చర్చలు జరిగిందన్నది ఇప్పటికీ సస్పెన్సుగా ఉండిపోయింది. ఇవ్వాళా రేపు అధికార, ప్రతిపక్షాల నేతలు కలిస్తే పార్టీ మారటమే ఉద్దేశ్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరిగిపోతోంది. ఇందులో చాలావరకు వాస్తవం కూడా ఉంటుంది.

అయితే ప్రకాష్ తో మంత్రి భేటీఅయిన మూడు రోజుల తర్వాత నలుగురు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఏకంగా రేవంత్ తోనే భేటీ అయ్యారు. ఈ విషయం పార్టీలో సంచలనంగా మారింది. సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్తా ప్రభాకరరెడ్డి, మాణిక్ రావు సీఎంతో భేటీ అయ్యారు. ఎవరు సీఎంతో భేటీ అయినా నియోజకవర్గ అభివృద్ధికోసమనే చెప్పటం మామూలే. కాబట్టి మరుసటి రోజు మీడియా సమావేశంలో సునీతా లక్ష్మారెడ్డి కూడా అలాగే చెప్పారు.

ఎంఎల్ఏ మాటలను నమ్మే వాళ్ళు నమ్మారు లేనివాళ్ళు లేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ ను కలిసిన నలుగురు ఎంఎల్ఏలందరు మెదక్ జిల్లాకు చెందిన వాళ్ళే. ఆరోజు నలుగురు ఎంఎల్ఏలు కలిస్తే ఆదివారం ప్రకాష్ గౌడ్ కలిశారు. ముందు ముందు ఇంకెంతమంది ఎంఎల్ఏలు కలుస్తారో చెప్పలేం. అసలు విషయం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుమాసాల్లో కూలిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ పదేపదే ప్రకటిస్తున్నారు. కొన్నిసార్లు రేవంత్ ప్రభుత్వాన్ని శాపనార్ధాలు కూడా పెడుతున్నారు.

ఇదే సమయంలో మాజీమంత్రి హరీష్ రావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నానా గోలచేస్తున్నారు. దీనికి కౌంటరుగా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు చాలామంది తమతో టచ్ లో ఉన్నారంటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు చెబుతున్నారు. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వెళ్ళే ఎంఎల్ఏలు ఎవరు కనబడటంలేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వైపు ఎంఎల్ఏలు చాలామందే ఉన్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇపుడు జరుగుతున్నదంతా ఇందులో భాగమేనా ?