మైల‌వ‌రం రాజ‌కీయాల్లో బిగ్ ట్విస్టులేనా…!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రం. ఇక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ రాజ‌కీయాలు నిన్న మొన్న‌టి వ‌ర‌కు జోరుగానే సాగాయి. అయితే.. ఇప్పుడు వైసీపీలోనే రాజ‌కీయాలు పెరిగిపోయాయి. ప్ర‌స్తుతం ఉన్న మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ను వ్య‌తిరేకిస్తున్న‌వారు రోడ్డెక్కుతున్నారు. త‌మ‌కు ఏం చేశార‌ని.. ఆయ‌న‌కు ఓటేయాల‌ని చాలా మంది క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌లు.. చ‌ర్చిస్తున్నా రు. కొంద‌రు సోష‌ల్ మీడియా గ్రూపులు క్రియేట్ చేసుకుని ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగాప్ర‌చారం చేస్తున్నారు.

దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేను వ్య‌తిరేకిస్తున్న‌వారి సంఖ్య పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇదే స‌మ‌యంలో.. వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌కూడా.. అంత‌ర్గ‌తంగా ప్ర‌భుత్వ తీరుపై వ్య‌తిరేక‌త వ్య‌క్తంచేస్తున్నారు. తాము ప‌నులు చేయించినా.. ప్ర‌భుత్వం బిల్లులు ఇవ్వ‌డం లేద‌ని, అభివృద్ధి అంటే.. కేవ‌లం సంక్షేమమేనా? రోడ్డు వేయొద్దా? నీటి స‌దుపాయాలు క‌ల్పించొద్దా? అంటూ.. ఆయ‌న ఇటీవ‌ల ఓబ‌హిరంగ స‌భ‌లో ప్ర‌శ్నించారు. ఇప్పుడు దీని తాలూకు వీడియోను ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తున్న‌.. వ‌ర్గం పార్టీ అధిష్టానానికి చేర వేసింది.

ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ ముద్దు.. ఎమ్మెల్యే వ‌ద్దు.. నినాదం జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈ ప‌రిణామాల‌కు తోడు.. ఓ కీల‌క మంత్రి.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఆది నుంచి ఇక్క‌డ క‌న్నేసిన స‌ద‌రు మంత్రి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌నిభావిస్తున్నారు. కానా..ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా ఆయ‌న త‌న అనుచ‌రుల‌ను రంగంలోకి దింపుతున్నారు. దీంతో వారు ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా ప్ర‌చారంలో ఉన్నారు.

దీంతో వైసీపీలో అంత‌ర్గ‌త రాజ‌కీయం అనేక రూపాల్లో ఇక్క‌డ సొంత నేత‌కే సెగ పుట్టిస్తోంది. ఎమ్మెల్యేనే స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేయ‌డం.. ఆయ‌న‌కువ్య‌తిరేకంగా క‌మ్మ వ‌ర్గం కాలు దువ్వ‌డం.. మ‌రోవైపు.. కీల‌క మంత్రి ఇక్క‌డ పావులు క‌దుపుతుండ‌డంతో వైసీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌హీన ప‌డుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు.. టీడీపీ ఈ విష‌యాన్ని నిశితంగా ప‌రిశీలిస్తోంది. త‌మ‌కు ఎలాంటి అవ‌కాశం ఉన్నా.. ప‌రిణామాల‌ను త‌మ‌వైపు అనుకూలంగా తిప్పుకోవాల‌ని భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.