వీళ్ళతో పెట్టుకుంటే కాంగ్రెస్ కి ఇబ్బందేనా ?

ఇండియా కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్, ఆప్ పార్టీల వైఖరి బాగా చర్చనీయాంశంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తమకు ఎవరితోను పొత్తుండదని ప్రకటించారు. వెంటనే పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ కీలకనేత భగవంత్ మాన్ మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ ఒంటరిగానే పోటీచేస్తుందన్నారు. ఏ పార్టీతో కూడా ఆప్ సీట్ల షేరింగ్ కు సిద్ధంగా లేదని ప్రకటించారు.

మమత, భగవంత్ ప్రకటనతో ఇండియా కూటమిలో గందరగోళం మొదలైంది. నిజానికి మమత అయినా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయినా ఎంతమాత్రం నమ్మదగ్గ వ్యక్తులు కారు. వీళ్ళిద్దరు కూడా ఎవరితో ఏ రోజు ఎలాగుంటారో ఊహించటం కూడా కష్టమే. వీళ్ళిద్దరిలో మమత వైఖరి మరీ అన్యాయమని ఇప్పటికే చాలాసార్లు నిరూపణైంది. ఆమెకు ఎవరితోను ఎక్కువరోజులు పొసగదు. తాను అనుకున్న నిర్ణయానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా మమత సహించలేరు.

ఆమధ్య జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధిగా తాను ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హాకు కూటమిలోని అన్నీ పార్టీలు మద్దతిచ్చాయి. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా కాంగ్రెస్ ప్రతిపాదించిన మార్గరెట్ ఆల్వాకు మద్దతివ్వటానికి మమత నిరాకరించారు. అంతేకాకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించారు. కారణం ఏమిటంటే రాష్ట్రపతి-ఉపరాష్ట్రపతి అభ్యర్ధుల ఎన్నిక మధ్య కాలంలో ఆమె ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధి జగదీప్ ధనకడ్ తో కలిసిపోయారు. ఒకవైపు ఇండియా కూటమిలో ఉంటూనే మరోవైపు ఎన్డీయేతో మాట్లాడుకున్నారు.

ఇందుకనే మమత ఎంతమాత్రం నమ్మదగ్గ వ్యక్తికాదనే ప్రచారం జరుగుతోంది. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద రాద్దాంతం చేసేసిన సందర్భాలున్నాయి. ఇక కేజ్రీవాల్ అయితే మొదటినుండి కాంగ్రెస్ వ్యతిరేకన్న విషయం తెలిసిందే. ఇపుడు కాంగ్రెస్ తో ఎందుకు మాట్లాడుతున్నారంటే అవతల ఎన్డీయే తనను వెంటాడుతోంది కాబట్టే. కాబట్టి ఇలాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకోవటం అంటే నెత్తిన కుంపట్లు పెట్టుకోవటమే. ఏరోజు ఏమి మాట్లాడుతారో కూడా తెలీని వీళ్ళు భాగస్వాములుగా ఉన్న ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినట్లే.