నీ వ‌ల్లే కుటుంబం చీలింది: జ‌గ‌న్‌పై ష‌ర్మిల

“నీ వ‌ల్లే మ‌న కుటుంబం చీలిపోయింది. ముందు ఈ విష‌యాన్ని గ‌మ‌నించు జ‌గ‌న‌న్నా!” అని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌వైఎస్ ష‌ర్మిల వ్యాఖ్యానించారు. బుధ‌వారం.. తిరుప‌తిలో నిర్వ‌హించిన ఇండియా టుడే కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… “కాంగ్రెస్ పార్టీ విభ‌జించి పాల‌న చేస్తోంది. గ‌తంలో నేను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. మా కుటుంబంలో చిచ్చు పెట్టింది. మా చిన్నాన్నను మా నుంచిదూరం చేసి నాపైనే పోటీ పెట్టింది. ఇప్పుడు నా సోద‌రిని తీసుకుని.. నా కుటుంబంలో చిచ్చు పెట్టింది” అని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

అయితే.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల ఘాటుగా స్పందించారు. “కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, నా కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ అన్న గారు. దేవుడే గుణపాఠం చెప్తారట. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు, జగన్ అన్న గారే కార‌ణం. ఇవ్వాళ వైఎస్‌ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్న గారే. దీనికి సాక్ష్యం దేవుడు. దీనికి సాక్ష్యం నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం” అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 18 మంది.. జ‌గ‌న్ కోసం ఆయ‌న వెంట నిల‌బ‌డ్డార‌ని.. వారంద‌రికీ మంత్రి ప‌ద‌వులు ఇస్తామ‌ని ఆశ పెట్టి.. ఇవాళ్ల మొండి చెయ్యి చూపించార‌ని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. “2012లో 18 మంది తమ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ళ కోసం తిరిగాం. అప్ప‌టి ఉప ఎన్నిక‌లో వారిని గెలిపించే బాధ్య‌త తీసుకున్నాం. వాళ్ళను గెలిపించాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, పిల్లలను కూడా పక్కన పెట్టీ.. ఎండనక, వాననక రోడ్ల మీదనే ఉన్నా. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే క‌దా అని ఆ యాత్ర కూడా చేశా. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగా. దేశంలోనే మ‌హిళ‌గా సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేశా. మిమ్మల్ని గెలిపించా. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు వేరే మనిషిగా మారిపోయాడు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు ..వైఎస్ పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నా. కానీ, ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు” అని షర్మిల గ‌తం చెప్పుకొచ్చారు.