అమ్మో ష‌ర్మిల‌.. ఊపిరాడ‌నివ్వ‌డం లేదుగా!

కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల.. వైసీపీపై విజృంభిస్తున్నారు. క్ష‌ణం తీరిక లేకుండా విమ‌ర్శ‌ల శ‌రాలు సంధిస్తున్నారు. మంగ‌ళ‌వారం జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభించిన ష‌ర్మిల‌.. శ్రీకాకుళంలో త‌న ప‌ర్య‌ట‌న‌ను ఆర్టీసీ బ‌స్సు నుంచే ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, త‌న సొంత చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిపై విమ‌ర్శ‌లు సంధించారు. అదేస‌మ‌యంలో అభివృద్ధి స‌వాళ్లు సంధించారు. పోల‌వ‌రం నుంచి ప్రాజెక్టుల వ‌ర‌కు, ర‌హ‌దారుల నుంచి మెట్రో రైళ్ల వ‌ర‌కు ఇలా.. అనేక అంశాల్లో అభివృద్ది ఎక్క‌డ ఉందంటూ.. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. దీనికి ఇంకా వైసీపీ రియాక్ట్ కావాల్సి ఉంది.

కానీ, ఇంత‌లోనే వైసీపీపై మ‌రికొన్ని విమ‌ర్శ‌ల‌తో ష‌ర్మిల రెచ్చిపోయారు. కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదా అంశాన్ని, బీజేపీతో వైసీపీ బంధాన్ని ఆమె లేవనెత్తారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల ఓట్లు వేయించుకునేందుకు వైసీపీ ప్ర‌త్యేక హోదా అంశాన్ని భుజాల‌పై వేసుకుంద‌ని, తాము అధికారంలోకి వ‌స్తే కేంద్రం మెడ‌లు వంచైనా స‌రే.. ఖ‌చ్చితంగా ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని తేల్చి చెప్పింద‌ని.. మ‌రి ఇప్పుడు నాలుగేళ్ల కాలంలో మెడ‌లు ఎందుకు వంచ‌లేక పోయార‌ని ష‌ర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు ఒక్క‌సారైనా పార్ల‌మెంటులో నిల‌దీశారా? అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. “జ‌గ‌న‌న్న‌గారూ.. ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రాన్ని ఎప్పుడైనా నిల‌దీశారా? క‌నీసం ప్ర‌శ్నించారా? ” అని షర్మిల నిల‌దీశారు. శ్రీకాకుళం జిల్లా బోర్డ‌ర్ ఇచ్ఛాపురంలో గ‌తంలో దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేసిన పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా నిర్మించిన పైలాన్ ను ష‌ర్మిల సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఆమె ప్ర‌సంగిస్తూ.. వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. “ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. జ‌గ‌న‌న్న గారు.. ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని సెల‌విచ్చారు. కేంద్రం మెడలు కూడా వంచుతామ‌న్నారు. ఇప్పుడు ఏమంది జ‌గ‌న‌న్న‌గారూ..స‌మాధానం చెప్పాలి” అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

కాగా, ష‌ర్మిల తొలి రోజు ప‌ర్య‌ట‌న‌ల‌తోనే ఇంత దూకుడు చూపిస్తే.. రాబోయే రోజుల్లో మ‌రింత‌గాఆమె దూకుడు ఉండే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అయితే.. ఇలా వైసీపీని టార్గెట్ చేయ‌డం ద్వారా కాంగ్రెస్ పుంజుకుంటుందా? అనేది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే. ఉద్దేశ‌పూర్వ‌కంగానే అన్న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లోకి ఇదే వాద‌న వెళ్లి బ‌ల‌ప‌డితే.. ఆమెకు, ఆమె రాజ‌కీయాల‌కు కూడా ఇబ్బందేనని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.