షాకింగ్‌: ఏపీలో ఇలా కూడా జ‌రుగుతోందా..?

అవును.. రాష్ట్రంలో కూడా ఇలా జ‌రుగుతోందా? ఇది కూడా రాజ‌కీయంలో భాగ‌మేనా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఒక‌ప్పుడు.. ఒక పార్టీలో ఉన్న నాయ‌కులు.. వేరే పార్టీల్లోకి మారితే.. వెంట‌నే ఎంత‌ఖ‌ర్చ‌యినా భ‌రించి.. త‌మ వారిని త‌మ వెంట తీసుకువెళ్లిపోతారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ బ‌లం, బ‌ల‌గంత‌గ్గ‌కుండా చూసుకుంటారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా చేస్తోందే. ఏపీలోనూ ఇలానే జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల పార్టీ మారిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అయినా.. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని అయినా.. ఇలానే చేశారు.

త‌మ త‌మ అనుచ‌రుల‌ను ఆయా పార్టీల్లోకి చేర్చించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. నాని అయితే.. ఏకంగా త‌న వ‌ర్గంగా ఉన్న నాయ‌కుడు న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాసుకు.. అసెంబ్లీ టికెట్ కూడా వైసీపీలో ఇప్పించుకున్నారు. ఇదంతా కామ‌న్‌. అయితే.. ఇప్పుడు ఏపీలో మ‌రో భిన్న‌మైన రాజ‌కీయం తెర‌మీద‌కి వ‌చ్చింది. పార్టీ ఏదైనా.. నాయ‌కులు ఒక నియోజ‌క‌వ‌ర్గంనుంచి మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి మారాల్సి వ‌స్తే.. ఒకింత ఇబ్బంది క‌రంగానే ఉంటుంది. కొత్త నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ‌కు తెలియ‌ని వారు త‌మ‌కు ఓటు వేస్తార‌న్న ఆవేద‌న కూడా క‌నిపిస్తుంది.

ఈ నేప‌థ్యంలో ఇలాంటి నాయ‌కులు ఇప్పుడు కొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టారు. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా వెలువ‌రించిన కొత్త ఓట‌ర్ల జాబితా స్ప‌ష్టం చేసింది. విష‌యం ఏంటంటే.. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న సిట్టింగుల‌ను లేదా.. నాయ‌కుల‌ను వైసీపీ ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపించింది. దీంతో వారు అక్క‌డ పోటీ చేయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో వీరు త‌మ అనుచ‌రుల‌ను కూడా త‌మ వెంట తీసుకువెళ్లాల‌ని భావించినా.. సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి లేదు. దీంతో వ్యూహాత్మ‌కంగా.. త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన అనుచరుల ఓట్ల‌ను ఇప్పుడున్న నియోజ‌క‌వ‌ర్గంలోకి మార్చుకుంటున్నార‌ట‌.

ఈ విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ఉదాహ‌ర‌ణ‌కు ఎక్స్ అనే నియోజ‌క‌వ‌ర్గం ఒక నాయ‌కుడి సొంత నియోజ‌క‌వ‌ర్గం అనుకుంటే.. పార్టీ అత‌నిని వై అనే నియోజ‌క‌వ‌ర్గానికి మార్చితే.. ఎక్స్ నియోజ‌క వ‌ర్గంలో ఉన్న త‌న అనుచ‌రుల ఓట్ల‌ను అక్క‌డ నుంచి వైకి త‌ర‌లించేశారు. దీంతో కొన్ని కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో ఓట‌ర్లు త‌గ్గిపోగా.. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో లెక్క‌లు భిన్నంగా మారాయి. ఇలాంటివారిపై దృష్టి పెట్టిన ఎన్నిక‌ల సంఘం.. చ‌ర్య‌లకు దిగుతోంది.

ఒక నియోజ‌క‌వ‌ర్గంలో శాశ్వ‌త చిరునామా ఉండి.. అక్క‌డే ఉంటున్న‌వారు.. వేరే నియోజ‌క‌వ‌ర్గంలో ఓటు వేసేందుకు అన‌ర్హులు. ఇదే సూత్రంతో ఎన్నిక‌ల సంఘం చ‌ర్య‌లు ప్రారంభించ‌నుంది. దీంతో మొత్తానికే మోసం వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, వేరే పార్టీ త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచే అవ‌కాశం ఉంటే.. ఆ పార్టీ ఓట్ల‌ను కూడా.. తీసేసేలా.. ఫాం-7లు ఇచ్చార‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ఇది కూడా తీవ్ర‌మైందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.