పార్టీలు కావాలా.. ఉద్యోగాలు కావాలా… పోలీసులు తేల్చుకోవాలి!

వైసీపీ నాయ‌కుల‌తో వేదిక‌లు పంచుకుంటున్న టీడీపీ నేత‌ల‌పై చంద్ర‌బాబు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. వారి నుంచి వివ‌ర‌ణ తీసుకుంటున్నారు. పార్టీ ప‌రంగా లైన్ దాట‌డానికి వీల్లేద‌ని కూడా చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు ఈ ప‌రంప‌ర‌లో పోలీసులు కూడా చేరారు. “ఇక‌, పోలీసులే అర్థం చేసుకోవాలి.“ అని ముక్త‌స‌రిగా చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నాయ‌కుల‌తో క‌లివిడిగా ఉండ‌డం, శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యాన్ని లైట్ తీసుకోవ‌డం వంటి ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“మీరు కూడా మారాలి. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నారు. వైసీపీ చేసే అరాచ‌కాల‌ను మీరు ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించ‌వ‌ద్దు“ అని పోలీసు ఉన్నతాధికారుల‌కు చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. తాజాగా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీనేత కొడాలి నానితో స‌న్నిహితంగా మెలిగిన ఎస్ ఐ స‌త్య‌నారాయ‌ణ‌ను పోలీసులు వాకెన్సీ రిజ‌ర్వ్ (వీర్‌)కు పంపేశారు. ఈ ప‌రిణామం పోలీసు వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. ఈ ఉత్త‌ర్వులు రావ‌డానికి ముందే.. చంద్ర‌బాబు ఉన్న‌తాధికారుల‌కు ఈ సందేశం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కుల‌కు.. పోలీసుల‌కు మ‌ధ్య స‌త్సంబంధాలు కొన‌సాగుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. గ‌త నెల‌లో శ్రీకాకుళంలో మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు కుమారుడు పెద్ద యాక్సిడెంట్ చేసి.. గొర్రెల కాప‌రి దాన‌య్య మృతికి కార‌ణ‌మ‌య్యాడు. ఈ కేసును వేరే వారిపై మోపే ప్ర‌యత్నం చేశారు. దీనికి కాశీబుగ్గ పోలీసు స్టేష‌న్ సీఐ, ఎస్సైలు స‌హ‌క‌రించార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వెంట‌నే స్పందించిన ప్రభుత్వం వారిని స‌స్పెండ్ చేసింది. ప్ర‌స్తుతం వారు స‌స్పెన్ష‌న్‌లోనే ఉన్నారు.

ఇక‌, తాడిప‌త్రిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజ‌క‌వ‌ర్గంలోకి రాకుండా ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే.. కొన్నాళ్ల తర్వాత‌.. పెద్దారెడ్డి నేరుగా నియోజ‌క‌వ‌ర్గంలోకి రావ‌డం, మాజీ ఎమ్మెల్యేజేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డికి స‌వాళ్లు రువ్వ‌డం వివాదానికి దారితీసింది. దీనిపై స‌మీక్షించిన పోలీసులు.. సీఐ, ఎస్ ఐలు.. పెద్దారెడ్డికి స‌హ‌క‌రించార‌ని తెలుసుకుని వారిని స‌స్పెండ్ చేశారు. ఇలా రాష్ట్రంలో వైసీపీ నేత‌లు, మాజీ మంత్రుల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్న పోలీసులు.. ఇక‌నైనా మారాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు చెబుతున్న మాట‌. ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని.. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ముప్పు వాటిల్లేలా చేసే వారిని ఉపేక్షించ‌రాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు.