మేడిగడ్డ పై విజిలెన్స్ సంచలన నివేదిక ?

అత్యంత వివాదాస్పదమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై విజిలెన్స్ ఉన్నతాధికారులు రెడీచేస్తున్న నివేదిక సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలోని నాసిరకమంతా నివేదికలో బయటపడిందిట. బ్యారేజి పిల్లర్లు కొన్ని కుంగిపోవటం సంచలనమైంది. బ్యారేజి నాణ్యతపై కాంగ్రెస్, బీజేపీలు సంధించిన ప్రశ్నలకు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు సమాధానం కూడా చెప్పుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి అండ్ కో ఎన్నిసార్లు ప్రశ్నించినా కేసీయార్ మేడిగడ్డ ప్రాజెక్టుపై మాట్లాడకపోవటమే కాకుండా ఎవరినీ మాట్లాడద్దని అప్పట్లో ఆదేశించారని వార్తలొచ్చిన మాట అందరికీ తెలిసిందే.

దాంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, మేడిగడ్డ బ్యారేజి అత్యంత నాసిరకంగా నిర్మించారనే ఆరోపణలతో కాంగ్రెస్ చెలరేగిపోయింది. ఇలాంటి అనేక ఆరోపణలకు కేసీయార్ సమాధానం చెప్పుకోలేకపోవటంతో చివరకు ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మేడిగడ్డ బ్యారేజి నాణ్యతపైన విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ నాయకత్వంలో కొందరు నిపుణుల సాయంతో మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన ఫైళ్ళను అధ్యయనం చేశారు. తర్వాత దీనిపైన ప్రభుత్వానికి రిపోర్టు అందించబోతున్నారు.

ఆ రిపోర్టులో బ్యారేజి నిర్మాణం సమస్ధం అత్యంత నాసిరకంగా చేసినట్లు చెప్పబోతున్నట్లు సమాచారం. నిపుణులతో మాట్లాడినపుడు వాళ్ళు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారట. విజిలెన్స్ తరపున ఇరిగేషన్ ఫీల్డులో బాగా అనుభవం ఉన్న కొందరు నిపుణులు నాలుగు రోజులు మేడిగడ్డను అధ్యయనం చేశారట. ప్రాజెక్టు నిర్మాణమే అత్యంత నాసిరకంగా జరిగిందని, నిర్మాణం తర్వాత కూడా నిర్మాణ సంస్ధ నిర్వహణ సరిగా లేదని నిపుణులు అభిప్రాయపడ్డారట. నిర్మాణానికి, నిర్వహణ సరిగా లేకపోవటానికి నిర్మాణ సంస్ధ ఎల్ అండ్ టి సంస్ధదే బాధ్యతగా తేల్చారట.

అసలు బ్యారేజి పునాదుల్లోనే అవినీతి జరిగిన కారణంగానే పిల్లర్లు కుంగిపోయినట్లు నిపుణులు తేల్చారు. 75 ఏళ్ళు అత్యంత పటిష్టంగా ఉండాల్సిన బ్యారేజి నాలుగేళ్ళకే నాసిరకంగా తయారైందంటే అందుకు నిర్మాణ సంస్ధతో పాటు అప్పటి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని నిపుణులు తేల్చారట. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టు ఇన్చార్జిలు కూడా బాధ్యత వహించాల్సిందే అని నిపుణులు తేల్చారు. సుమారు రు. 4 వేల కోట్లతో నిర్మించిన బ్యారేజి ఇపుడు ఎందుకూ పనికిరాకుండా పోయిందని నిపుణులు అభిప్రాయపడ్డారట. ప్రాజెక్టులో పూర్తి నీటి నిల్వచేస్తే ఇంకెంత ప్రమాదం బయటపడుతుందో అని నిపుణులు ఆందోళన వ్యక్తంచేసినట్లు సమాచారం. మొత్తంమీద వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందన్నది వాస్తవం.