చంద్రబాబు కేసులో సుప్రీం కీలక తీర్పు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ అధికారులు కొద్ది నెలల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ పై ఉన్న చంద్రబాబు ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే తన అరెస్టు సమయంలో సెక్షన్ 17ఏ పాటించలేదని, తన ఎఫ్ ఐఆర్ ను క్వాష్ చేయాలని చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది.

ఈ క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జడ్జిలు అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ వేర్వేరుగా తీర్పు వెల్లడించారు. అంతేకాదు, ఈ కేసు విచారణను త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలని డివిజనల్ బెంచ్ విజ్ఞప్తి చేసింది. దీంతో, స్కిల్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా లేదా అన్న వ్యవహారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం దగ్గరకు చేరింది.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17  ఏ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే తనను అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు, ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, గత ఏడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు ఆ క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో, ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆ క్వాష్ పిటిషన్ కొట్టివేత తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ పై ఈ రోజు డివిజనల్ బెంచ్ తీర్పునిచ్చింది.