రెండు పేర్లు ఫైనలయ్యాయా ?

తెలంగాణాలో  ఎంఎల్ఏ కోటాలో భర్తీ అవ్వాల్సిన రెండు ఎంఎల్సీ అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ ఫైనల్ చేసిందా ? అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం రెండుసీట్లను అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు దాదాపు ఖాయమయ్యాయట. అయితే వీళ్ళ పేర్లతో పాటు షబ్బీర్ ఆలి, చిన్నారెడ్డి పేర్లను కూడా జాబితాలో రేవంత్ రెడ్డి చేర్చినట్లు తెలుస్తోంది. మహేష్  కుమార్, అద్దంకి దయాకర్ పేర్లను మొదటి ప్రాధాన్యతలో ఎందుకు చేర్చారంటే వీళ్ళిద్దరికి మొన్నటి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు.

దయాకర్, మహేష్ కు టికెట్లు ఖాయమైనా చివరి నిముషంలో వేరే వాళ్ళకి కేటాయించాల్సొచ్చింది. దాంతో వీళ్ళని బుజ్జగించేందుకు అధిష్టానం ఎంఎల్సీ స్ధానాలను అప్పట్లోనే ఆఫర్ చేసింది. దానికి ఓకే చెప్పిన వీళ్ళు అభ్యర్ధుల విజయానికి పనిచేశారు. ఇదే సమయంలో షబ్బీర్ ఆలి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోటీచేశారు. అయితే ఓడిపోయారు. టికెట్ దక్కించుకున్నా ఓడిపోయిన వారికి ఎంఎల్సీ, రాజ్యసభ సీట్లలో అవకాశం ఇవ్వకూడదని అధిష్టానం మొదట్లోనే కండీషన్ పెట్టింది.

అధిష్టానం పెట్టిన కండీషన్ కు ఒప్పుకున్న తర్వాతే షబ్బీర్ లాంటి వాళ్ళు పోటీచేశారు. అయితే చాలామంది గెలవగా షబ్బీర్, మధుయాష్కి లాంటి కొందరు ఓడిపోయారు. ఓడిపోగానే ఇపుడు షబ్బీర్ మళ్ళీ ఎంఎల్సీ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడే పార్టీలోని ఇతర నేతలతో సమస్యలు మొదలయ్యాయి. అంటే టికెట్ తెచ్చుకుని వీళ్ళే పోటీచేయాలి. ఒకవేళ ఓడిపోతే నామినేషన్ పద్దతిలో వచ్చే ఎంఎల్సీలు, రాజ్యసభ అవకాశం కూడా వీళ్ళకే దక్కాలన్నట్లుగా ఉంటుంది కొంతమంది వైఖరి.

సో, వీటన్నింటినీ ఆలోచించిన తర్వాతే రేవంత్ మాత్రం ప్రయారిటిలో అద్దంకి, మహేష్ పేర్లను పెట్టారట. మంత్రివర్గంలో మైనారిటీలకు చోటులేకుండా పోయింది. ఎందుకంటే మొన్న పోటీచేసిన ముగ్గురు మైనారిటీలూ ఓడిపోయారు. తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రేవంత్, అధిష్టానం మైనారిటీల గురించి ఆలోచిస్తోంది. మరి తాజాగా వచ్చిన అవకాశంలోనే అద్దంకి, మహేష్ ను ఎంపికచేస్తారా ? లేకపోతే మైనారిటి కోటా పేరు చెప్పుకుని షబ్బీర్ ఎంపిక అవుతారో చూడాలి.