ఏపీకి క‌నుగోలు ఎంట్రీ… కాంగ్రెస్‌కు అదిరిపోయే వ్యూహం

ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీపై దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా అడుగంటి పోయింది. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఈ పార్టీకి క‌నీసం 1 శాతం ఓటు బ్యాంకు కూడా ద‌క్క‌లేదు. ఒక‌ప్పుడు రాజ్య‌మేలిన ఈ రాష్ట్రంలో ప‌రిస్థితిదారుణంగా ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. ఏపీలో జ‌వ‌జీవాలు పుంజుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే దివంగ‌త సీఎం వైఎస్ కుమార్తె వైఎస్ ష‌ర్మిల‌కు ఏపీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించింది.

ప్ర‌స్తుతం సంక్రాంతి, త‌ర్వాత‌.. ష‌ర్మిల కుమారుడి వివాహం ఉన్నారు. ఈ రెండు అయిన త‌ర్వాత‌.. ఈ నెల ఆఖ‌రులో లేదా.. ఫిబ్ర‌వ‌రి తొలివారంలోనో.. ష‌ర్మిల ఏపీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు రంగం రెడీ అవుతోంది. ఇక నాణేనికి ఒక వైపు అన్న‌ట్టుగా.. పార్టీకి మేలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. వైఎస్ అభిమానులు.. తిరిగి వ‌చ్చి పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని పార్టీ అంచ‌నా వేసింది. అదేవిధంగా వైఎస్ సానుకూల ఓటు బ్యాంకు కూడా త‌మ‌కు ల‌బ్ధిని చేకూరుస్తుంద‌ని భావిస్తోంది.

మ‌రోవైపు.. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్లీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న సునీల్ క‌నుగోలును ఏపీకి తీసుకువ చ్చేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌శాంత్ కిశోర్ త‌ర్వాత‌.. దేశ‌వ్యాప్తంగా సునీల్ క‌నుగోలు పాత్ర పెరిగింది. గ‌త ఏడాది జ‌రిగిన క‌ర్ణాటక‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను విజ‌యం దిశ‌గా న‌డిపించిన కనుగోలు.. పార్టీకి పున‌ర్వైభ‌వం తీసుకువ‌చ్చారు. అయితే.. ఆయ‌న ప‌నిచేయ‌ని రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో మాత్రం పార్టీ పూర్తిగా దెబ్బ‌తింది.

ఈ నేప‌థ్యంలో క‌నుగోలును ఏపీకి తీసుకురావ‌డం ద్వారా పార్టీని పుంజుకునేలా చేయాల‌న్న‌ది .. హ‌స్తం నేత‌ల ఉద్దేశం. ఇప్ప‌టికిప్ప‌డు పార్టీ అధికారంలోకి రాక‌పోయినా.. వచ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని పుంజుకునేలా చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తోంది. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌కు ఎలాంటి ఓటు బ్యాంకు లేదు. ఈ నేప‌థ్యంలో ముందుగా పార్టీ పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. దీనిని గ‌మ‌నించిన హ‌స్తం నాయ‌కులు.. ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటార‌ని స‌మాచారం.