వైసీపీ ఎత్తుల‌ను ప‌సిగ‌ట్ట‌క‌పోతే.. టీడీపీకి ఇబ్బందేనా..!

ఏపీ అధికార పార్టీ వైసీపీ అభ్య‌ర్థుల‌ను మారుస్తోంది. కీల‌క నేత‌ల‌కు కూడా సీఎం జ‌గ‌న్ ఎలాంటి హామీలూ ఇవ్వ‌డం లేదు. త‌న ప‌ని తాను చేసుకుని పోతున్నారు. ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందుగానే .. అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు బంధువులు వ‌ర‌స‌య్యేవారిని కూడా ఆయ‌న గెల‌వ‌రు అను కున్నా.. ప్ర‌జ‌ల్లో నాడి త‌గ్గింద‌ని భావించినా వెంట‌నే ప‌క్క‌న పెడుతున్నారు.ఈ విష‌యంలో ఎక్కడా జ‌గ‌న్ రాజీ ప‌డ‌డం లేదు.

ఇక‌, ఇదేస‌మ‌యంలో కొత్త ముఖాల‌కు కూడా అవ‌కాశం ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇవి కేవలం మార్పులు-చేర్పులు గానే చూసేందుకు అవ‌కాశం లేదు. ఇది చాలా వ్యూహం. దీనివెనుక .. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే లాజిక్ కూడా దాగి ఉన్నాయి. అయితే.. దీనిని ఆసాంతం అర్ధం చేసుకోవ‌డంలోనూ.. దీనిని గ్ర‌హించ‌డంలోనూ టీడీపీ ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. ఏమాత్రం ఈవిష‌యంలో రాజ‌కీయం చేయాల‌ని చూస్తే.. చివ‌ర‌కు ముప్పు తెచ్చుకున్న‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

మార్పులు చేయ‌డం అంటే.. అంత ఈజీకాదు. అందునా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీల‌ను ప‌క్క‌న పెట్ట‌డం సాహ‌సోపేతం. అయినా.. జ‌గ‌న్ ఇంత క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారంటే.. ఎక్క‌డో ప్ర‌జానాడిని ఆయ‌న గ‌ట్టిగానే ప‌సిగ‌ట్టారు. స‌హ‌జంగానే ఉండే వ్య‌తిరేక‌త‌ను ఆయ‌న అంచ‌నా వేసుకున్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి కూడా ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంది. సిట్టింగుల‌పై వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అయినా.. మార్పుల‌కు చంద్ర‌బాబు పెద్ద‌గా శ్రీకారం చుట్టలేదు.

ఏమాట‌కు ఆమాటే చెప్పాల్సి వ‌స్తే.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ అయినా.. సిట్టింగుల‌ను ప‌క్క‌న పెట్టిందే త‌ప్ప‌..చంద్ర‌బాబు ఆ సాహ‌సం చేయ‌లేక‌పోయారు. పైగా ప్ర‌జ‌ల‌కు వంగివంగి దండాలు పెట్టి.. త‌ప్పులు చేస్తే.. క్ష‌మించాల‌ని.. త‌న‌ను చూసి వోటేయాల‌ని కోరారు. కానీ, ఈ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అనేది చూస్తే.. ఇప్పుడు కూడా చంద్ర‌బాబు మార్పుల‌కు పెద్ద‌గా శ్రీకారం చుట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో క‌నీసం వైసీపీ వ్యూహాల‌ను లోతుగా అయినా.. అధ్య‌య‌నం చేయాల‌ని టీడీపీ సానుభూతి ప‌రులు సూచిస్తున్నారు. మ‌రి ఆదిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తారా? అనేది చూడాలి.