సెక్రటేరియట్ నిర్మాణంపైనే ఆరా ?

కేసీయార్ హయాంలో నిర్మితమైన సెక్రటేరియట్ భవనం వ్యయంపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి బుధవారం నాడు సెక్రటేరియట్ నిర్మించిన కాంట్రాక్టు సంస్ధ ప్రతినిధులతో పాటు ఫైనాన్స్ ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమాచారం. సెక్రటేరియట్ నిర్మాణానికి మొదట్లో వేసిన అంచనా వ్యయం ఎంత ? అంచనాలు ఎవరు రెడీచేశారు ? డిజైన్లను ఎవరిచ్చారు ? తర్వాత అంచనా వ్యయం ఎంతకు పెరిగింది ? ఎందుకు పెరిగిందనే విషయాలపై రేవంత్ ఆరా తీసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

సెక్రటేరియట్ పనులు మొదలైనపుడు అంచనా వ్యయం రు. 617 కోట్లే అని అయితే వివిధ కారణాలతో తర్వాత వ్యయం రు. 1150 కోట్లకు చేరినట్లు ఉన్నతాదికారులు చెప్పారట. అంచనా వ్యయం పెరిగినందుకు పరిపాలనా అనుమతులు చూపించమని అడిగితే లేదన్నారట. పరిపాలనా అనుమతులు లేకుండానే అంచనా వ్యయాన్ని దాదాపు డబుల్ చేసేసినట్లు తెలిసింది. విచిత్రం ఏమిటంటే సెక్రటేరియట్ నిర్మాణ పనులతో పాటు రిపేర్ పనులు ఇంకా జరుగుతుండటమే.

1150 కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనాలు నాణ్యతాపరంగా అత్యంత నాసిరకంగా ఉన్నాయని ఇప్పటికే బయటపడ్డాయి. అప్పట్లో కేసీయార్, కేటీయార్, హరీష్ రావుల చాంబర్లు మాత్రం విశాలంగా ఉండగా మిగిలిన మంత్రులు, ఉన్నతాదికారుల చాంబర్లు మాత్రం ఇరుకుగా ఉన్నాయని ఆరోపణలు వినిపించాయి. నాణ్యత కూడా అత్యంత నాసిరకంగా ఉన్న విషయం బయటపడింది. పెద్ద వర్షం వస్తే నీళ్ళు చాంబర్లలోపలికి కురుస్తుంది. క్యారిడార్ అంతా నీళ్ళతో నిండిపోతుంది. నీళ్ళని మనుషులు బకెట్లతో తోడి బయట పారబోయాలి.

పైగా రు. 200 కోట్లు పెట్టి కొన్న ఫర్నీచర్ కూడా అత్యంత నాసిరకంగా ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఫర్నీచర్, గార్డెనింగ్, సెంట్రల్ ఏసీ, ఇంటర్నెట్ పనులంటు రకరకాల కారణాలతో అంచనా వ్యయాలను కేసీయార్ ప్రభుత్వం పెంచుకుంటు పోయిందని బయటపడింది. బయటనుండి చూడటానికి మాత్రమే సెక్రటేరియట్ భవనం బాగుంటుంది లోపలంతా డొల్లే అన్న విషయం కేసీయార్ హయాంలోనే బయటపడింది. కాకపోతే అప్పట్లో చాలామందిని లోపలికి అనుమతించే వారు కాదు కాబట్టి, మీడియా కూడా భయపడి వ్యతిరేకంగా ఏమీ రాయలేదు. ఇపుడు ప్రభుత్వం మారిన తర్వాతే డొల్లతనం బయటపడుతోంది.