టికెట్ రాకుంటే 40 కోట్లు మిగిలినట్లే: దగ్గుబాటి

వైసీపీ మాజీ నేత, సీనియర్ పొలిటిషన్ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొద్దిరోజుల క్రితం వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో తాను వైసీపీ నుంచి ఓటమిపాలు కావడమే మంచిదయిందని, లేదంటే తన నియోజకవర్గ ప్రజలు తనను అభివృద్ధి చేయలేదని నిలదీసేవారని దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి. ఆ వ్యాఖ్యల వేడి తగ్గక ముందే తాజాగా ఆయన మరోసారి వైసీపీని పరోక్షంగా దుయ్యబట్టారు.

రాబోయే ఎన్నికల్లో టికెట్ రానివారు అదృష్టవంతులు అంటూ దగ్గుబాటి చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టికెట్ రాని వాళ్ళకు 30-40 కోట్లు మిగిలినట్టేనని అన్నారు. జీవితంలో వారు సంపాదించింది అంతా ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని అన్నారు. ఇక, ఎమ్మెల్యేలు సంపాదించిన డబ్బు మొత్తం ఓ ఖజానాకే చేరుతుందని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి కామెంట్లు చేశారు. ఓడిన వాడు అక్కడే ఏడుస్తాడని, గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడని సెటైర్లు వేశారు. నిజమైన ప్రజాప్రతినిధులను భగవంతుడే కాపాడాలని దగ్గుబాటి అన్నారు.

రాబోయే ఎన్నికల్లో తాను, తన కుమారుడు హితేష్ పోటీ చేయడం లేదని క్లారిటీనిచ్చారు. 30-40 కోట్లు పెట్టి గెలిచిన తర్వాత డబ్బులు సంపాదించే అవకాశాలు ఇప్పుడు పెద్దగా లేవని చెప్పుకొచ్చారు. గతంలో పెట్టిన డబ్బులు సంపాదించేందుకు కొంత అవకాశం ఉండేదని, ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోందని, పార్టీ అధిపతి…ఎమ్మెల్యేలను ఎంపీలను ఉత్సవ విగ్రహాలు చేశారని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మద్యం, మైనింగ్ వంటి వ్యవహారాల్లో లక్షల కోట్లు దోచుకుంటున్నారని, దేశంలో సింగిల్ మాన్ పార్టీలు మొత్తం ఇలాగే నడుస్తున్నాయని అన్నారు.

ఇక, డబ్బులు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలన్నట్లుగా రాజకీయ వ్యవస్థ మారిపోయిందని, ప్రస్తుతం రాజకీయాలు గౌరవప్రదంగా లేవని దగ్గుబాటి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేలు ఊరికి సేవ చేసి గౌరవప్రదంగా బతికే వారిని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అన్నారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అని తలలు బాదుకుంటున్నారని చెప్పారు.