రేవంత్ కంటే కేసీఆర్ బలవంతుడన్న కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ నేతల విమర్శలకు దీటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అనే రెండు అక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలు పవర్ఫుల్ అని షాకింగ్ కామెంట్లు చేశారు. భవిష్యత్తులో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ఫిబ్రవరిలో ప్రజల మధ్యకు కేసీఆర్ వస్తున్నారని ఆయన చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ లోకసభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో అందరం కలిసి పోరాడుదామని, లోక్ సభ స్థానం కచ్చితంగా గెలవాల్సిందేనని కేటీఆర్ అన్నారు. తెలంగాణ బలం..గళం బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుపొందామని, 11 స్థానాల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యామని కేటీఆర్ చెప్పారు. అయితే, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూ ముందుకు పోదామని పిలుపునిచ్చారు.

అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్….నెల రోజులు దాటినా అమలు చేయకపోవడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని చెప్పారు. ఇక, ప్రజా పాలన దరఖాస్తుల పట్ల కొందరు ప్రైవేటు వ్యక్తులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని. ఆ దరఖాస్తుల్లో కోట్లాదిమంది తెలంగాణ ప్రజలకు సంబంధించిన సున్నితమైన డేటా ఉందని కేటీఆర్ అన్నారు. ఆ డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 6 గ్యారెంటీలలో ఏదైనా మీకు ఇస్తామంటూ ఫోన్ వస్తే ఓటీపీ, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దని చెప్పారు.

కాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవంత్ రెడ్డి…శాసనమండలిని ఇరానీ కేఫ్ అని, ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అని అన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణి దేవి, ప్రభాకర్ కలిసి రేవంత్ పై ఫిర్యాదు చేశారు. శాసనమండలిని ఇరానీ కేఫ్ ,మండలి సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.