వారికి ఏపీలో ఎంపీ సీట్లు ఇప్పిస్తా: సీఎం రేవంత్

ఏపీలో ఎంపీ టికెట్ల విష‌యంపై తెలంగాణ సీఎం, కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి చెందిన‌ కొంద‌రు అభ్య‌ర్థులు త‌న‌ను క‌లుసుకున్నార‌ని, టికెట్లు కోరుతున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ విష‌యంలో వారికి టికెట్లు ఇవ్వ‌క‌పోతే.. ష‌ర్మిల ద్వారా అయినా.. వారికి టికెట్లు వ‌చ్చేలా చేస్తానని ఆయ‌న చెప్పారు. అయితే, ఆయ‌న ఏ పార్టీ అనేది స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. ఇక‌, ఏపీ సీఎం జ‌గ‌న్ తో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి వైరం లేద‌న్నారు. రాజకీయంగా ఏపీతో ఉండే సంబంధాలు, విభేదాలు స‌హ‌జ‌మేన‌ని చెప్పారు. వాటిని కూడా నిబంధ‌న‌లు, విభ‌జ‌న చ‌ట్టం మేర‌కు ఎలా ఉంటే అలానే ప‌రిష్క‌రించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.

తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సీఎం రేవంత్ ప‌లు విష‌యాల‌పై స్పందించారు. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప్ర‌ధానిగా రాహుల్‌ను చూడాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. తాను ముఖ్య‌మంత్రి అయ్యేందుకు రాహుల్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చార‌ని తెలిపారు. అయితే, ఏపీ సీఎం జ‌గ‌న్‌.. మాత్రం మ‌రోసారి మోడీనే ప్ర‌ధాని కావాల‌ని కోరుకుంటున్నార‌ని.. తాను మాత్రం రాహుల్ కావాల‌ని భావిస్తున్నాన‌ని చెప్పారు. దీనికిగాను తాను ఏం చేయాలో అంత‌వ‌ర‌కు చేస్తాన‌ని చెప్పారు.

అధికారం అండగా లేకుంటే.. కాంగ్రెస్‌ను ఎదుర్కోలేమని కేసీఆర్ అనుకుంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో బీజేపీని కాదని ప్రతిపక్షాలు మనుగడ సాధించలేకపోతున్నాయన్నారు. సమస్యలు రాకుండా ఉంటాయని బీజేపీతో కేసీఆర్ కలిసిపోవొచ్చున‌ని రేవంత్ చెప్పారు. బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటే పార్ల‌మెంటు స్థానాల్లో గెలవొచ్చని బీజేపీ నేతలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణలో బీజేపీ పొత్తులు పెట్టుకోవాలని చూస్తోంద‌ని అన్నారు.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్‌ పాలన 6 గ్యారంటీలతో ఓటు అడగాలని అనుకుంటున్నామ‌ని సీఎం రేవంత్‌ చెప్పారు. ప్రజలు పార్లమెంట్‌ ఎన్నికల్లో మాకు అండగా ఉంటారని అనుకుంటున్నామ‌న్నారు. బీజేపీ, బీఆర్ ఎస్‌ పరోక్షంగా పొత్తు పెట్టుకుంటాయని, ప్రత్యక్షంగా వాళ్లు పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మేలు కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా బీజేపీ, బీఆర్ఎస్‌ వ్యవహారం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. గ‌డిచిన నెల రోజులపాటు ఏ రకంగా పాలన చేశామో.. భవిష్యత్‌లోనూ అలాగే ముందుకెళ్తామ‌ని సీఎం రేవంత్ చెప్పారు.