షాకింగ్‌: వైసీపీ ఎమ్మెల్సీ సోద‌రుడి దారుణ హ‌త్య‌

ఏపీలో దారుణం జ‌రిగింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న నాయ‌కురాలి సోద‌రుడిని కొంద‌రు గుర్తు తెలియ‌ని దుండ‌గులు అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. క‌ర్నూలు జిల్లాలోని పెండేక‌ల్లు రైల్వే జంక్ష‌న్‌లో జ‌రిగిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన పోతుల సునీత‌.. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఆమె సోద‌రుడు రోము పెండేక‌ల్లు రైల్వే జంక్ష‌న్ వ‌ద్ద మృతి చెందిన స్థితిలో క‌నిపించారు. అయితే.. ఆయ‌న ర‌క్త‌పు మ‌డుగులో ఉండ‌డం.. ప‌క్క‌నే పెద్ద పెద్ద బండ‌రాళ్లు ఉండ‌డంతో ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆయ‌న‌ను దారుణంగా హ‌త‌మార్చి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. ఘ‌ట‌న విష‌యం తెలియ‌గానే పోలీసులు, ప‌లువురు వైసీపీ నాయ‌కులు కూడాఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.

కాగా, 57 ఏళ్ల రాము..అలియాస్ అన్న.. అలియాస్ చిన్న‌.. అవివాహితుడు. గ‌తంలో 30 ఏళ్ల కింద‌ట ఆయ‌న పీపుల్స్‌వార్ ఉద్య‌మంలో చురుగ్గా ప‌నిచేశారు. అప్ప‌ట్లో రాముపై రివార్డు కూడా ప్ర‌క‌టించారు. పోలీసులు సైతం ఆయ‌న కోసం ఊరూ వాడా గాలించారు. ఈ క్ర‌మంలో రాము 1991లో ప్ర‌భుత్వానికి లొంగిపోయారు. ప్ర‌స్తుతం గ్రామంలోనే ఉంటూ పనులు చేసుకుంటున్న ఆయన 10 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్న‌ట్టు తెలిసింది.

కాగా, క‌ర్నూలు జిల్లా పెండేక‌ల్లు రైల్వే జంక్ష‌న్ సమీపంలో శ‌నివారం రాత్రి నిద్రించగా దుండగులు బండరాయితో కొట్టి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మ‌రోవైపు.. ఈ విష‌యం రాజ‌కీయంగా కూడా దుమారం రేపింది. దీని వెనుక ఎవ‌రున్నార‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది.