ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం పక్కా: బ్రదర్ అనిల్

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని వైఎస్ షర్మిల విలీనం చేసిన వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సమయంలో షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బ్రదర్ అనిల్ కుమార్ కాంగ్రెస్ లో షర్మిల చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కచ్చితంగా షర్మిల ప్రభావం ఉంటుందని బ్రదర్ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

జగన్ కు వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తే షర్మిల ఏం చేస్తారని మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల ప్రకారం షర్మిల పూర్తిస్థాయిలో పనిచేస్తారని, ఆమెకు ఏ బాధ్యత అప్పగించిన సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని అనిల్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని, ఈ కుటుంబంలో తాము కూడా సభ్యులమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని, దాని వల్ల దేశానికి మంచి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, సీఎం జగన్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ఎయిర్పోర్టులో వీరిద్దరూ కలిసి కాసేపు ముచ్చటించుకున్న వైనం చర్చకు దారితీసింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి. సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచే షర్మిలను తనను జగన్ దూరం పెట్టారని బీటెక్ రవితో బ్రదర్ అనిల్ కుమార్ అన్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో షర్మిలకు ఆసక్తి లేదని, జగన్ వల్లే తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చిందని ఆయన అన్నారట.

ఇక, వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేయడం బాధాకరమని, గతంలో వైఎస్సార్ ఎక్కడున్నా కడప రాజకీయాలను వివేకా చూసుకునే వారని అనిల్ చెప్పారట. ఇక, వివేకా కేసులో తనను ఇరికించాలని చూశారని అనిల్ తో బీటెక్ రవి అన్నారని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, తమ ఊరి అల్లుడైన బ్రదర్ అనిల్ తో మర్యాదపూర్వకంగానే మాట్లాడానని, నూతన సంవత్సర శుభాకాంక్షలు మాత్రమే చెప్పానని ఓ మీడియా సంస్థ ప్రతినిధితో బీటెక్ రవి అన్నట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నందున శుభాకాంక్షలు చెప్పానని బీటెక్ రవి అన్నట్లుగా తెలుస్తోంది.