బీజేపీ కూడా కలిసిపోతుందా ?

పొత్తులో కలిసినడవాలని బీజేపీ కూడా డిసైడ్ అయ్యిందా ? ఇందుకు బీజేపీ అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ? ఇపుడిదే అంశంపై కమలనాదుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ నుండి పరిశీలకులుగా వచ్చిన నేతల నుండి సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం జరగబోయే పార్టీ కోర్ కమిటి సమావేశంలో మరింత స్పష్టగ రాబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

తన మిత్రపక్షం బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ లేకుండా జనసేనతో మాత్రమే ఎన్నికలకు వెళ్ళటం చద్రబాబుకూ ఇష్టంలేదు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న బీజేపీ అగ్రనేతలు చివరకు టీడీపీ, జనసేనతో చేతులు కలపటానికి సానుకూలంగా స్పందిచారని పార్టీవర్గాల సమాచారం. పొత్తులో భాగంగా ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నట్లు కమలంపార్టీ నేతలు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సడెన్ గా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో బీజేపీ నేతలు కూడా పొత్తు విషయాన్ని పరిశీలించారట. కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకుంటే కమ్యూనిస్టులు కూడా జతకడితే ఇండియా కూటమి ఏపీలో కూడా పోటీచేయటం ఖాయం. అప్పుడు టీడీపీ, జనసేన మాత్రమే పోటీచేస్తే బీజేపీ ఒంటరైపోతుంది. అందుకనే టీడీపీ, జనసేనతో పొత్తుకు రెడీ అయితే ఏపీలో ఎన్డీయే కూటమి పోటీలో ఉన్నట్లవుతుందని అగ్రనేతలు భావించారట. అంటే మూడు పార్టీలతో ఒకవైపు ఇండియా కూటమి, మూడు పార్టీలతో మరోవైపు ఎన్టీయే కూటమి ఎన్నికలకు రెడీ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఒంటరిపోటీకి రెడీగా ఉన్నారు.

కాకపోతే కూటముల్లో భాగంగా పార్టీలు పోటీచేయబోయే సీట్ల సంఖ్య, నియోజకవర్గాల ఏవన్న విషయం తేలటంలో కాస్త ఇబ్బందులు ఎదురవ్వటం ఖాయం. ఆ సమస్యను గనుక పార్టీలు అధిగమిస్తే పొత్తులు సాఫీగా జరిగే అవకాశాలున్నాయి. అప్పుడు ఎన్నికలు చాలా రంజుగా ఉంటుందనటంలో సందేహంలేదు. మరి పొత్తులపై క్లారిటి ఎప్పుడొస్తుందో ? చివరకు ఏమవుతుందో చూడాలి.