తిరువూరు కేశినేని బ్రదర్స్ రచ్చ..ఎస్ఐకి గాయాలు

విజయవాడ రాజకీయాలలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం కొంతకాలంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని కొద్ది నెలలుగా పార్టీతో అంటీముట్టనట్టుగా ఉండటం, తన సోదరుడు కేశినేని చిన్నితో విభేదాల నేపథ్యంలో పార్టీపై అలకబూనడం హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో కేశినేని చిన్నికి టికెట్ ఇచ్చేందుకు టిడిపి అధిష్టానం కూడా మొగ్గుచూపుతోందని, అందుకే పార్టీపై, చిన్నిపై నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తిరువూరు టీడీపీ కార్యాలయం దగ్గర కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ జరగడం సంచలనం రేపింది.

ఇద్దరు నేతల అనుచరులు, కార్యకర్తలు పరస్పరం ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకొని రభస చేశారు. జై చిన్ని, జై నాని అంటూ పోటాపోటీగా నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. చిన్నిని పార్టీ ఆఫీసు లోపలికి వెళ్లకుండా కేశినేని నాని వర్గీయులు అడ్డుకున్నారు. జనవరి 7వ తారీఖున చంద్రబాబు సభ నేపథ్యంలో ఏర్పాట్ల కోసం తిరువూరు టిడిపి ఆఫీస్ లో సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉంది. స్థానిక నేతలతో కలిసి విడివిడిగానే ఈ అన్నదమ్ములు ఇద్దరు భేటీ అవుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు జరగాల్సిన సమన్వయ కమిటీ భేటీకి జనసేన కార్యకర్తలు కూడా హాజరయ్యారు. అక్కడ నాని ఫ్లెక్సీ లేకపోవడంతో చిన్ని ఫ్లెక్సీని నాని అనుచరులు చింపేశారు. అందులో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండడంతో జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశాన్ని బహిష్కరించారు.

100 మందితో బైక్ ర్యాలీగా కేసినేని నాని తిరువూరు టీడీపీ కార్యాలయానికి వచ్చారు. అయితే, ఆ కాసేపటికి దాదాపు రెండు వేల మందితో చిన్ని అక్కడికి ర్యాలీగా వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య పోటాపోటీగా నినాదాలు హోరెత్తాయి. ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయంలోని ఓ గదిలో నాని కూర్చున్నారు. ఆయనతోపాటు గద్దె రామ్మోహన్ కూడా లోపల ఉన్నారు. దీంతో వారిద్దరూ బయటికి రావాలని చిన్ని అనుచరులు తలుపులు బాది నినాదాలు చేశారు.

ఇదే సమయంలో తిరువూరు టిడిపి ఇన్చార్జి దేవదత్తుపై నాని వర్గీయులు దాడి చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ గొడవలో ఓ ఎస్ ఐ తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. మరి, ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందన ఏవిధంగా ఉంటుంది, ఇద్దరు అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చంద్రబాబు ఏ రకమైన ప్రయత్నాలు చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.