ఉద్యోగులకు రేవంత్ ‘స్వీట్’ కబురు?

ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే ఇకనుండి ప్రతినెలా మొదటి రెండు రోజుల్లోనే జీతాలు చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రేవంత్ ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారట. జీతాలతో పాటు పెన్షన్లు, బిల్లులను కూడా చెల్లించేందుకు రెడీ అవ్వాలని రేవంత్ ఆదేశించారట. కేసీయార్ పదేళ్ల పాలనలో ఉద్యోగులకు జీతాలు ఏ నాడూ నెలమొదట్లో రాలేదు.

నిజానికి ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని నిబంధన ఏమీలేదు. కాకపోతే మొదటి తేదీనే జీతాలు చెల్లించటం అన్నది ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను, పరిస్ధితిని తెలియజేస్తుంది. ఈ సూత్రం ప్రభుత్వానికే కాదు ప్రైవేటు సంస్ధలకు కూడా వర్తిస్తుంది. అందుకనే ఉద్యోగులకు జీతాల చెల్లింపును ప్రభుత్వాలైనా, ప్రైవేటు సంస్ధలైనా మొదటి రెండురోజులను పెట్టుకున్నాయి. కేసీయార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిస్ధితి మారిపోయింది. ఒకవైపు దేశంలోనే తెలంగాణా అత్యంత ధనిక రాష్ట్రమని చెబుతునే జీతాలు మాత్రం ఇచ్చేవారు కాదు.

చాలా శాఖల్లో ఉద్యోగులకు రెండు మూడు వారాల్లో జీతాలు అందేవి. కొన్ని శాఖల్లో అయితే జీతాలకు ఆల్ఫాబెట్ల క్రమాన్ని కూడా అమలుచేశారు. జీతాల పరిస్ధితే ఇలాగుంటే ఇక పెన్షన్ల గురించి, బిల్లుల క్లియరెన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ పరిస్దితులను దృష్టిలో పెట్టుకునే ప్రతినెల మొదటి రెండు రోజుల్లోనే జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని రేవంత్  డిసైడ్ అయ్యారట. అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ప్రతినెలా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కలిపి సుమారు రు. 6 కోట్లు అవసరమవుతుంది. ఏ ప్రభుత్వమైనా ఈ మొత్తాన్ని ప్రతి నెల మూడోవారంలోనే రెడీగా పెట్టుకుంటుంది. శాలరీ బిల్లులను రెడీచేసుకుని ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడేట్లుగా బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు నాలుగోవారం అవుతుంది. దాంతో నెల మొదట్లోనే జీతాలు పడేందుకు అవకాశం ఉంటుంది. కేసీయార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కసరత్తు అంతా అస్తవ్యస్ధమైపోయింది. అందుకనే ఇపుడు రేవంత్ ఇచ్చిన ఆదేశాలు ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు లాగ వినబడుతోంది.