వాసుప‌ల్లికి.. స‌హ‌కారం నై.. తేల్చేసిన నేత‌లు!

ఆయ‌న పార్టీ మారిన ఎమ్మెల్యే. ముందు అంతా ఫీల్ గుడ్‌. పార్టీ మారే వ‌ర‌కు అంద‌రూ ఆహా.. ఓహో అన్న‌వారే. కానీ, రోజులు గ‌డిచి ఎన్నిక‌లకు స‌మ‌యం చేరువ అవుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఆ వారే.. ఆయ‌న‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. స‌హ‌క‌రించేందుకు మొహం చాటేస్తున్నారు. ఆయ‌నే విశాఖప‌ట్నం జిల్లా ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో టీడీపీ టికెట్‌పై గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేష్‌. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీలో ఉన్నారు. త‌న కుమారుడితో స‌హా 2021లో పార్టీ నుంచి జంప్ చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై ఆయ‌న పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు మాత్రం ఆయ‌న‌కు ఏమాత్రం అనుకూలంగా లేవ‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. వాసుపల్లిని లక్ష్యంగా చేసుకొని సొంత సామాజికవర్గంతో పాటు పార్టీ వార్డు స్థాయి నేతలు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. వాసుపల్లికి మళ్లీ టికెట్‌ ఇస్తే పార్టీ నుంచి తప్పుకుంటామని హెచ్చరికలు పంపిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌తో వాసుపల్లికి పొసగడం లేదు. తన సామాజిక వర్గానికి చెందిన వారెవరికీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టికెట్‌ రాకుండా వాసుపల్లి అడ్డుపడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు.

పార్టీ మారినా.. వైసీపీలో అసమ్మతి సెగతో వాసుపల్లి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎవరు ఎటువైపో తెలియని పరిస్థితి ఏర్ప‌డింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ తరఫున దక్షిణం నియోజ‌క‌వ‌ర్గం నుంచి మరొక అభ్యర్థి పేరు అధిష్ఠానం పరిశీలనలో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తొలి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్ ఇవ్వాల‌న్న క్షేత్ర‌స్థాయిలో డిమాండ్‌ను వైసీపీ అధిష్టానం ప‌రిశీలిస్తోంది. అంతేకాదు.. పార్టీకి అండగా నిలిచే మత్స్యకార సామాజిక వర్గం కూడా వాసుప‌ల్లిని కోరుకోవ‌డం లేద‌న్న‌ది క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు చెబుతున్న మాట‌. ఈ నేపథ్యంలో వాసుప‌ల్లి ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.