ఇప్పుడిక డాలర్ బాయ్ వీడియో.. అంతా ఆమే చేసిందట

కొద్ది రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ఒక మహిళ రావటం.. తనను పదేళ్లుగా 139 మంది అత్యాచారం చేసినట్లుగా ఫిర్యాదు చేయటం.. వంద పేజీలకు పైనే కంప్లైంట్ కాపీ ఉండటం.. అందులో పలు పేర్లు సినీ.. విద్యార్థి సంఘాలతో పాటు.. పలువురు మీడియా ప్రతినిధుల పేర్లు ఉండటం సంచలనంగా మారింది. అయితే.. మిగిలిన విషయాల మాదిరి ఈ కంప్లైంట్ ను హడావుడిగా బ్రేకింగ్ ల మీద బ్రేకింగ్ లు వేసి.. నానా రచ్చ చేయకుండా ఆచితూచి అన్నట్లుగా స్పందించింది.

రోజులు గడుస్తున్న కొద్దీ.. ఈ ఉదంతంలో కొత్త పేర్లు.. కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తనను మానసికంగా.. శారీరకంగా హింసకు గురి చేశారన్న మాటను బాధితురాలు పేర్కొంది. ఆమెకు అండగా ఒక ఎన్జీవో ఉండటం.. వారి కనుసన్నల్లోనే అంతా జరగటంపై కొంత అనుమానం వ్యక్తమైంది. విచిత్రంగా.. సదరు ఎన్జీవో సంస్థ అధినేత శ్రీకర్ రెడ్డి కారణంగానే తానీ పని చేయాల్సి వచ్చిందని.. తనను హింసకు గురి చేశారని.. తాను ఫిర్యాదు ఇచ్చినట్లుగా 139 మంది అత్యాచారం చేయలేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన వైనం సంచలనంగా మారింది. అందరి వేళ్లు.. డాలర్ భాయ్ వైపునకు మళ్లాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా డాలర్ భాయ్ రియాక్ట్ అయ్యారు. ఒక వీడియోను విడుదల చేసిన అతను.. తన తప్పేమీ లేదని.. తాను కూడా ఆమె బాధితుడినేనని.. డబ్బుల కోసమే ఆ పని చేస్తుందని చెప్పి మరో సంచలనానికి తెర తీశారు. చాలామందితో పాటు తనను కూడా హనీ ట్రాప్ చేసినట్లుగా సెల్ఫీ వీడియో ప్రజల ముందుకు వచ్చాడు.

తాను ఎక్కడికి పారిపోలేదన్న అతడు.. ఆ అమ్మాయి చెబుతున్న పేర్లలో అందరి వద్ద నుంచి ఆమె డబ్బులు వసూలు చేసిందని.. తాను చెప్పేది నిజమో.. అబద్ధమో తెలాలంటే.. ఆమె బ్యాంకు ఖాతాల్ని చెక్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే పలు ట్విస్టులున్న ఈ ఉదంతం రానున్న రోజుల్లో మరెన్ని కొత్త మలుపులు తిరుగుతుందో చూడాలి.