రేవంత్ కొత్త నిర్ణయం

ప్రజావాణిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. ప్రజల సమస్యలు విని వీలైనంత తొందరగా తీర్చే ఉద్దేశ్యంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే రేవంత్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రేవంత్ ను కలిసి సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారమవుతాయని రాష్ట్రంలోని చాలామంది జనాలు ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుకు వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రజాదర్బార్(ప్రజావాణి)లో రోజుకు 4 వేలమంది బాధితులు వస్తున్నట్లు లెక్క తేలింది.

అందుకనే ఇక నుండి అంటే కొత్త సంవత్సరం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని హైదరాబాద్ లోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలోను జరపాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ప్రతి ఎంఎల్ఏ వారంలో ఒకరోజు ప్రత్యేకించి ప్రజావాణి కార్యక్రమంలోనే ఉండి బాధితులతో మాట్లాడాలని రేవంత్ ఆదేశించారు. ప్రజావాణి లాంటి కార్యక్రమాలతోనే ప్రజలకు ప్రభుత్వం దగ్గరవుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ప్రజలిచ్చే సమస్యలను పరిశీలించి పరిష్కారం చూపేందుకు, ఫాలో అప్ చేసేందుకు ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలోను ఒక నోడల్ అధికారిని నియమించే ఆలోచనలో ఉన్నారు రేవంత్.

ప్రతి నియోజకవర్గంలోను ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తే జనాలంతా వినతులు తీసుకుని హైదరాబాద్ కు వచ్చే బాధలు తప్పుతాయని రేవంత్ భావించారు. అందుకనే నియోజకవర్గాల స్ధాయిలో కూడా ప్రజావాణినిని మొదలుపెడుతున్నది. ఇపుడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే గ్రీవెన్స్ కు ప్రజావాణి కార్యక్రమం అదనంగా పనిచేస్తుంది. పదేళ్ళ పాలనలో కేసీయార్ ఏనాడు ఈ విధంగా బాధితులను కలిసిందిలేదు. అసలు సచివాలయంకు కేసీయార్ రావటమే చాలా ఎక్కువన్నట్లుగా ఉండేది.

వారాల తరబడి ఫాం హౌస్లో కూర్చునే వారు. మంత్రులు, ఉన్నతాధికారులు కలవాలని అనుకున్నా కేసీయార్ కలిసే వారు కాదు. అలాంటిది ఇపుడు రేవంత్ ప్రతిరోజు జనాలను కలుస్తు, ఉన్నతాధికారులతో సెక్రటేరియట్లో సమీక్షలు నిర్వహిస్తుంటే అందరు హ్యాపీగా ఫీలవుతున్నారు. కేసీయార్ పదేళ్ళ పాలనతో ఇపుడు రేవంత్ పాలనను పోల్చి చూసుకోవటం ఎక్కువైపోతోంది. అందుకనే ప్రజావాణిలోనే కాకుండా రేవంత్ ను కలవటానికి జనాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు సచివాలయంకు రావటం ఎక్కువైపోతోంది. మరిలా ఎంతకాలం రేవంత్ జనాలను కలుస్తారో చూడాలి.