వైసీపీని ఓడించాలంటే రూ.కోట్లు పెట్టాల్సిందేనంటున్న బాబు

అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న మొండి పట్టుదలతో వైసీపీ.. అధికారంలోకి రాకపోతే భవిష్యత్ ఉండదనే భయంతో టీడీపీ.. వచ్చే ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి ఎన్నికల్లో గెలిచేందుకు ఏమైనా చేస్తుందన్న సంగతి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలియంది కాదు. వైసీపీ వరుసగా రెండో సారి ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు వేల కోట్ల రూపాయాలు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడదు. ఈ విషయం తెలిసే బాబు కూడా ముందే జాగ్రత్త పడుతున్నారు. వైసీపీని ఓడించాలంటే రూ.వేల కోట్లు పెట్టాల్సిందేనని పార్టీ నాయకులను ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నారని టాక్.

వైసీపీ దుష్ట పాలన సాగిస్తుందని, జగన్ ను ఇంటికి పంపించాలని టీడీపీ తీవ్రమైన విమర్శలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇక వైసీపీపై ప్రజల్లో ఏర్పడుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంపై బాబు ఫోకస్ పెట్టారు. అయితే కేవలం ఈ వ్యతిరేకత మాత్రమే సరిపోదని అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించాలంటే ఆర్థిక బలం కూడా ఉండాలని బాబు అనుకుంటున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రజా బలం కంటే కూడా డబ్బు బలమే కీలకంగా మారిన సంగతి తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో అధికారం కాపాడుకోవడం కోసం వైసీపీ ఒక్కో నియోజకవర్గంలో కనీసం రూ.50 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైందని టాక్. ఈ విషయం తెలుసుకున్న బాబు ఇప్పుడు తమ పార్టీ తరపున డబ్బున్న బడా బాబులను బరిలో దించాలని చూస్తున్నారని తెలిసింది. టికెట్ ఆశిస్తున్న నాయకులతో మాట్లాడుతున్న బాబు.. భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ముందే చెబుతున్నారంటా. అలాగే అభ్యర్థులు ఆర్థిక పరిస్థితిపై అంచనాకు వచ్చిన తర్వాతే టికెట్ ఖాయం చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పని చేయడం, కొన్నేళ్లుగా పార్టీలోనే ఉండటం విషయాలన్ని తర్వాత ముందు డబ్బు ఉందా? లేదా? అనేదే బాబు చూస్తున్నారని టాక్.