జగన్ ధీమా ఇదేనా ?

ఎన్నికల సమయంలో నేతలు పార్టీలమధ్య దూకుడ్లు మామూలే. ముఖ్యంగా టికెట్ల విషయంలోనే నేతలు పార్టీలు మారుతుంటారు. ఒకపార్టీలో ఉన్నవారు తమకు టికెట్లు రావని కన్ఫర్మ్ అయితే వెంటనే పార్టీమారిపోవటానికి సిద్ధపడతారు. ఇపుడు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసినా వైసీపీ నుండి ఇప్పటివరకు పార్టీ మారుతున్నట్లు ప్రకటన లేదు. జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఎవరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీనికి కారణం ఏమిటి ?

ఏమిటంటే పార్టీమారినా పోటీచేసేందుకు వాళ్ళకు అవకాశాలు తక్కువన్న ధీమాతో జగన్ ఉన్నట్లు అనుమానంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో సుమారు 70 నియోజకవర్గాల్లో భారీ మార్పులుంటాయని అంచనా. ఇందులో తక్కువలో తక్కువ 40 మందికి అసలు టికెట్లే రావని ప్రచారం జరుగుతోంది. మరో 30 మందికి నియోజకవర్గాలు మార్చటం, లేదా ఎంపీలుగా పోటీచేయించటం తప్పదన్న ప్రచారం అందరికీ తెలిసిందే. కొందరు మంత్రులు, ఎంఎల్ఏలను జగన్ ఎంపీలుగా పోటీచేయించాలని అనుకుంటున్నారట. అలాగే మరికొందరు ఎంపీలకు ఎంఎల్ఏలుగా పోటీచేసే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.

మార్పులు ఎలాంటివి అయినా ఇంతపెద్ద స్ధాయిలో మార్పులు చేయటం అన్నది చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. ఎందుకింతటి పెద్ద సహసం చేయటానికి జగన్ రెడీ అయిపోయారు ? అసలు జగన్ ధైర్యం ఏమిటనే చర్చ పెరిగిపోతోంది. దీనికి సమాధానం ఏమిటంటే ఇప్పటికిప్పుడు పార్టీలో నుండి ఇతర పార్టీల్లోకి జంప్ చేసినా అక్కడ టికెట్ గ్యారెంటీ లేకపోవటమే. టికెట్ దక్కదని తెలిసిన తర్వాత జగన్ మీద కోపంతో ఎవరైనా సిట్టింగ్ ఎంఎల్ఏ ఏమిచేస్తారు ?

మామూలుగా అయితే టీడీపీ లేదా జనసేనలోకి వెళ్ళాలి. ఇపుడు కూడా అలా వెళితే ఏమవుతుంది ? ఆ పార్టీల తరపున పోటీచేసే అవకాశం దక్కుతుందా ? పార్టీలోకి తీసుకున్నా టికెట్ గ్యారెంటీలేదన్న విషయం జగన్ కు బాగా తెలుసు. టిక్కెట్ దక్కనపుడు ఏమిచేయాలి ? ఎంఎల్ఏ అభ్యర్ధి గెలుపుకు సహకరించాలి. పోటీచేసే అవకాశం దక్కనపుడు ఏ పార్టీలో ఉంటే ఏమిటి ? అనే ఆలోచనలో సిట్టింగ్ ఎంఎల్ఏలున్నట్లు జగన్ పసిగట్టారు. అందుకనే ఇంత ధైర్యంగా మార్పులకు రెడీ అయినట్లున్నారు.