టికెట్ ద‌క్క‌క‌పోతే.. ఒంట‌రిపోరుకు రెడీ..

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. గ‌తంలో మాదిరిగా కేవ‌లం జెండా మోసి బ‌తికేసే నాయ‌కులు.. అధినేత ఏది ఇస్తే అది తీసుకుని స‌ర్దేసుకునే నాయ‌కులు ఇప్పుడు లేరు. ఇప్పుడంతా.. మా కేంటి? అనే టైపులోనే రాజ‌కీయాలు సాగుతున్నాయి. దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. పాత‌త‌రం నాయ‌కులు అయితే.. ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో వ‌చ్చిన జీతాన్ని కూడా పార్టీకి ఇచ్చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. న‌డుచుకుంటూ చ‌ట్ట స‌భ‌ల‌కు వెళ్లిన వారు కూడా ఉన్నారు.

కానీ, త‌రం మారిపోయింది.. త‌రాలు మారిపోయాయి. నాయ‌కుల అభిరుచులు కూడా మారుతున్నాయి. మా మేలు.. ముఖ్యం .. మా సీటు ముఖ్యం.. మా హ‌వా ముఖ్యం.. అనే నాయ‌కులు పెరుగుతున్నారు. ఎందెందు వెతికినా.. ఇలాంటి నాయ‌కులే క‌నిపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్ ద‌క్క‌ద‌ని భావించిన వారు.. నామినేష‌న్ల‌కు ముందు రోజు వ‌ర‌కు కూడా మారుతూనే ఉన్నారు. పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఉన్నామ‌ని చెప్పిన బీఆర్ఎస్ నాయ‌కులు కూడా జంపింగ్ చేసేశారు.

సో.. మొత్తానికి త‌రంతోపాటు నాయ‌కుల స్వ‌రం కూడా మారుతోంది. ఇక‌, ఇప్పుడు ఏపీ విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ట ప‌రిస్థితి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అజెండా ఉంది. వైసీపీ గెలుపు గుర్రాలు.. బీసీలు.. ప్రజాభిమానం.. గ్రాఫ్ అంటూ.. నాలుగునియ‌మాలు పెట్టుకుని అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టింది. ఇక‌, టీడీపీ-జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేవార‌కే టికెట్లు అని ఏకైక ఫార్ములాతో ముందుకు సాగుతోంది.

దీంతో ఇరు పార్టీల్లోనూ కొంద‌రికి టికెట్లు ద‌క్కొచ్చు.. ద‌క్క‌క‌పోవ‌చ్చు. ఈ విష‌యంపైనే నాయ‌కులు అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. ఇక్క‌డ వారికి పార్టీల‌తో ప‌నిలేదు. కేవ‌లం టికెట్ల‌తోనే ప‌ని. త‌మ‌కు ఇస్తే స‌రే.. లేకుంటే ఒంట‌రిగా అయినా.. పోటీ చేయాల‌నేది నాయ‌కుల వ్యూహం. అంతేకాదు.. తాము ఓడినా..త‌మ‌ను కాద‌న్న పార్టీని ఓడించ‌డంకూడా..ఇప్పుడు వీరి ల‌క్ష్యంగా మారింది. తెలంగాణ‌లోని సుమారు 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే వ్యూహంఫ‌లించి.. అక్క‌డ బీఆర్ ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఇదే ఫార్ములాతో నాయ‌కులు ఆలోచ‌న‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.