రేవంత్ పిలుపు కోసం మల్లారెడ్డి వెయిటింగ్

కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చేరిపోయేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సిద్ధంగా ఉన్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ ఎప్పుడెప్పుడు పిలుస్తారా? ఎప్పుడు పార్టీ జంప్ చేద్దామా? అని మల్లారెడ్డి వెయిటింగ్ చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా మల్లారెడ్డి.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు, ఛాలెంజ్ లు చేసిన సంగతి తెలిసిందే. తొడగొట్టి మరీ రేవంత్ కు మల్లారెడ్డి సవాలు విసిరారు. పదునైన మాటలతో దూషించారు. కానీ ఇప్పుడు రేవంత్ దయ కోసం మల్లారెడ్డి ఎదురు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రాకపోయినా మల్లారెడ్డితో పాటు తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ఇటీవల మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. అప్పటి నుంచి మల్లారెడ్డి ప్రవర్తన మారినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ కు మద్దతుగా మల్లారెడ్డి మాటలుంటున్నాయి. మరోవైపు తనపై కేసులు కక్ష సాధింపులు కానే కావని మల్లారెడ్డి చెబుతున్నారు. అంతేకాకుండా తాజాగా అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకుడు తీన్మార్ మల్లన్నతో మల్లారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు మద్దతిస్తావా అని మల్లన్న అడిగితే.. అసెంబ్లీలో ఎప్పుడైనా కాంగ్రెస్ కు సీట్లు తగ్గితే కచ్చితంగా మద్దతిస్తానని మల్లారెడ్డి అన్నారు.

మరోవైపు ఎన్నికలకు ముందు కూడా అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా తాను మళ్లీ మంత్రిని అవుతానని మల్లారెడ్డి చెప్పారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంటే కాంగ్రెస్ గెలిస్తే పార్టీ మారడం ఖాయమని మల్లారెడ్డి చెప్పకనే చెప్పారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతునిస్తానని మల్లారెడ్డి మరోసారి ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు మల్లారెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. తనతో పాటు మల్కాజిగిరి నుంచి గెలిచిన తన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని వెంటబెట్టుకుని మరీ హస్తం గూటికి వెళ్లేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారని టాక్. ఇప్పటికిప్పుడు రేవంత్ పిలిస్తే వెంటనే బీఆర్ఎస్ కు మల్లారెడ్డి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే ఈ గుసగుసలు వినిపిస్తున్నాయని చెబుతున్నారు.